TRS campaign : హుజురాబాద్లో జోరుగా టీఆర్ఎస్ ప్రచారం..!

హుజురాబాద్లో టీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పల్లెపల్లెన తిరుగుతున్నారు. ఇదిగో.. మీ గెల్లు శ్రీనివాస్ యాదవ్.. మీ గరీబు మట్టి బిడ్డ.. రెండే గుంటలున్నోడు.. వేల కోట్ల అధిపతి ఈటలతో పోటీ పడుతున్నాడు అంటూ జనాన్ని ఆకట్టుకున్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్కు మద్దతుగా మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆశీర్వదించి పంపించిన ఉద్యమ నాయకుడిని గెలిపించడం మన బాధ్యత అని తెలిపారు.
అటు టీఆర్ఎస్కు ఇప్పటికే పలు సంఘాలు మద్దతు తెలపగా జమ్మికుంటలో గంగపుత్రులు గెల్లు శ్రీనివాస్యాదవ్కు మద్దతుగా ఆశీర్వాద సభ నిర్వహించారు. గంగపుత్ర నాయకుడు టంగుటూరి రాజ్కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు మంత్రి కొప్పులతో పాటు రామగుండం, ముషీరాబాద్ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, ముఠా గోపాల్ హాజరయ్యారు. పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి, రైతులు పండించే ధాన్యం కొనొద్దని సూచించే బీజేపీకి ఓటెందుకు వేయాలో ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఫలం అందుకున్న వారు మత్స్యకారులేనని, గంగపుత్రుల కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించారు.
మీ బిడ్డగా ఇక్కడికొచ్చినా.. ఆశీర్వదించండి.. అండగా ఉంటా అని సభలో గెల్లు శ్రీనివాస్యాదవ్ గంగపుత్రులకు విజ్ఞప్తి చేశారు. తన జీవితమంతా పేద ప్రజల కోసమే కొట్లాడానని, విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో పనిచేశానని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు గడిచిందని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని హామీలిచ్చినా, ఇప్పటి వరకు రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్కు హుజూరాబాద్ నియోజకవర్గ గంగపుత్రులు మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల ఖర్చు కోసం 25వేల116 అందజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com