Munugodu Bypolls : మునుగోడు టీఆర్ఎస్ టికెట్ ఆయనకేనా..

Munugodu Bypolls : మునుగోడు టీఆర్ఎస్ టికెట్ ఆయనకేనా..
Munugodu Bypolls : మునుగోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దాదాపుగా ఖరారయినట్లే తెలుస్తోంది..

Munugodu Bypolls : మునుగోడులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దాదాపుగా ఖరారయినట్లే తెలుస్తోంది.. అభ్యర్థి విషయంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో ప్రగతి భవన్‌లో కీలక సమావేశం నిర్వహించిన కేసీఆర్‌.. మునుగోడు ఉప ఎన్నికపైనే ప్రధానంగా చర్చించారు.. అయితే, ఈ సమావేశం తర్వాత వెంటనే అభ్యర్థిని ప్రకటిస్తారనే చర్చ జరిగింది.. కానీ, అభ్యర్థిని ప్రకటించే విషయంలో కేసీఆర్‌ మరోసారి వేచి చూసే ధోరణితో ఉన్నట్లుగా తెలుస్తోంది.

అధికారికంగా ప్రకటించకపోయినా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కేసీఆర్‌ దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాతే అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో సమావేశమైన అనంతరం సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో ఈ అంశంపై సమాలోచనలు జరిపినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని జగదీశ్ రెడ్డికి ముఖ్యమంత్రి స్పష్టం చేశారని.. అప్పటివరకు పార్టీ లైన్‌లోనే ఎన్నికల ప్రచారం చేయాలని ఆయనను ఆదేశించినట్లుగా గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది.

మరోవైపు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే నేతలతో చర్చలు జరిపి వారిని సముదాయించాలని మంత్రి జగదీశ్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నేతలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని.. ఇందులో కేడర్‌ను కూడా భాగస్వామ్యం చేయాలని కేసీఆర్ టీఆర్ఎస్ నేతలకు సూచించినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పలు మండలాల్లో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని పదివేల మందితో జరపాలని కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది.

పార్టీ నాయకత్వం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును అభ్యర్థిగా ఖరారు చేసిందని.. ఈ విషయంలో ఎవరూ ఎలాంటి అభ్యంతరాలు పెట్టాల్సిన అవసరం లేదని.. ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా తనకు చెప్పవచ్చని జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి వారికి నచ్చజెబుతున్నారు. కేవలం నాయకులతోనే కాకుండా కార్యకర్తలతోనే జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు చర్చిస్తున్నారు. కచ్చితంగా మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగరాలని.. అందుకోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు.

మరోవైపు మునుగోడులో ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడిన తరువాత పర్యటించాలని గులాబీ బాస్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం.. చండూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయించినట్లుగా సమాచారం. ఈ సభలో అభ్యర్థి పేరును ప్రకటించేలా గులాబీ బాస్ కేసీఆర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ప్రతి ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపిక విషయంలో మిగతా పార్టీల కంటే ఎప్పుడూ ముందుండే కేసీఆర్.. మునుగోడు విషయంలో మాత్రం గతానికి భిన్నంగా వ్యవహరించడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story