TS: ప్రియుడి కోసం ప్రియురాలి నిరసన

పాఠశాలలో పుట్టిన ఆకర్షణ కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరిని ఒకరు ఘాడంగా ప్రేమించుకున్నారు. ఈ ప్రేమాయాణం పదేళ్ల పాటు కొనసాగింది. ఇద్దరూ డిగ్రీలు పూర్తి చేశారు. ఇక పెళ్లి చేసుకొని కలిసుండాలనుకున్నారు. ఇందుకు ఇరు కుటుంబ పెద్దల్ని ఒప్పించి ఒక్కటవుదామనుకున్నారు. యువతి తల్లిదండ్రులు ఒప్పుకున్నప్పటికీ యువకుని కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. వారి ప్రేమకు అడ్డుకట్ట వేసి ససేమిరా అన్నారు. తక్కువ కులం అమ్మాయి కోడలుగా రావడం ఇష్టం లేదన్నారు. దీంతో వారికి ఎదురు తిరగడం ఇష్టంలేక అదే మాట ప్రియురాలికి చెప్పి ప్రియుడు సైలెంటయ్యాడు. ఏంచేయలో తెలియని యువతి ప్రియుడి కోసం నిరస చేయడం ప్రారంభించింది. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా మోస్రా మండలంలోని గోవూర్ గ్రామానికి చెందిన కుమ్మరి నరేష్, గంగోత్రి పదేళ్లుగా ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యుల మాట విన్న నరేష్ పదేళ్ల ప్రేమకు సమాధి కట్టేశాడు.
దీంతో చేసేదేం లేక గంగోత్రి నరేష్ ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. "వారు కుమ్మరి వారు, మేము ఎరుకలి వాళ్లం. ఈ విషయం తెలిసి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు. నన్ను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇప్పుడేమో నిన్ను పెళ్లి చేసుకుంటే మా అమ్మనాన్న చనిపోతామని అంటున్నారని చెబుతున్నాడు. అబ్బాయి తల్లిదండ్రులు అతన్ని దాచిపెట్టారనీ, తనను కలవకుండా చేస్తున్నారని వెల్లడించింది. అతనికి వేరే వివాహం చేయాలని చూస్తున్నారని తెలిపింది. ఈ విషయం గ్రామ సర్పంచ్, పెద్దల దృష్టికి తీసుకెళ్లామని అలాగే పోలీస్స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది. అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నామంటున్నారు కానీ వారం రోజులైనా కేసు ముందుకు సాగడంలేదని వాపోయింది. నరేష్ కోసం 4 రోజులుగా అక్కడే ఉండి గంగోత్రి ఆందోళన చేస్తోంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. గంగోత్రికి మహిళలు, కుటుంబ సభ్యులు మద్ధతుగా నిలుస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com