TS : నిరుద్యోగ మార్చ్... జిల్లాల్లో బీజేపీ పోరుబాట

TSPSC పేపర్ లేకేజీ అంశంపై పోరు మరింత ఉదృతం చేయాలనీ నిర్ణయించింది బీజేపీ. ఇప్పటికే పలు దశల్లో ఉద్యమాలు చేసిన ఆ పార్టీ..... ఇకపై జిల్లాల్లో పోరుబాట కు సిద్దమవుతోంది. పేపర్ లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడం, మంత్రి కేటీఆర్ బర్తరఫ్, పేపర్ లీకేజీ తో నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలన్న డిమాండ్లతో నిరుద్యోగ మార్చ్ కు సిద్దమవుతున్నారు. ఈ పోరాటంలో భాగంగా ప్రతి ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. మిలియన్ మార్చ్ స్పూర్తితో.. నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఉమ్మడి పది జిల్లా కేంద్రాలలో ఈ మార్చ్ నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు. మొదటగా వరంగల్ జిల్లాలో ఈ మార్చ్ ను ఈ నెల 15న నిర్వహించాలని నిర్ణయించారు.
ఇప్పటికే కాకతీయ యూనివర్సిటీతో పాటు వరంగల్ జిల్లాలోని అన్ని యూనివర్సిటీలు, విద్యాసంస్థల విద్యార్థులు, నిరుద్యోగుల తో సమావేశాలు ఏర్పాటు చేశారు. హనుమకొండలో నిర్వహించే నిరుద్యోగ మార్చ్ విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనంతరం.. ఈ నెల 18న మహబూబ్ నగర్ లో నిర్వహించున్నారు. ప్రతి మూడు రోజులకు ఒక జిల్లాలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ లో ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ పెద్దల లింకులను బయట పెడతామంటున్నారు బీజేపీ నేతలు. అయితే నిరుద్యోగ మార్చ్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అనుమతులు ఇవ్వకపోతే బీజేపీ ఎలాంటి కార్యాచరణ అమలు చేయబోతుందన్నది ఆసక్తిగా మారింది...
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com