TS : ఈనెల 14న అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ
అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈనెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా శిఖరమంత ఎత్తయిన ఆయన విగ్రహం ఆవిష్కరణకు జరుగుతున్న ఏర్పాట్లపై మంత్రులు, అధికారులతో చర్చించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ, అనంతరం నిర్వహించే బహిరంగ సభకు సంబంధించి న ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. దేశం గర్వించదగ్గ స్థాయిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంలో ఆవిష్కరణ సభ కూడా అంతే ఉన్నత స్థాయిలో ఆ యన ఔన్నత్యాన్ని మరింత గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పేలా ఉండాలని మంత్రులు, అధికారులకు స్పష్టం చేశారు.
హుస్సేన్ సాగర్ తీరంలోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పనులు తుదిదశకు చేరుకోగా.. అనుకున్న సమయంలోగా పూర్తిచేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అంబేద్కర్ విగ్రహాన్ని రూపొందించడం తనకు అత్యంత సంతృప్తిని కలిగించిందని సీ ఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా విగ్రహ రూపశిల్పి రామ్ వాంజీ సుతార్ కృషిని ప్రశంసించారు. వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించాలని నిర్ణయించారు.
అంబేద్కర్ కనబరిచిన దార్శనికతతోనే దళిత గిరిజన బహుజన వర్గాలతోపాటు సకల జనులందరికీ ఆర్థిక, సామాజిక న్యాయం, అన్ని రంగాల్లో సమన్యాయం అమల్లోకి వ చ్చిందని అన్నారు. సమసమాజ నిర్మాణం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ప్రపంచం గర్వించదగ్గ మేధావి అని కొనియాడారు. పక్కనే సచివాలయం, ఎదురుగా తన ఆరాధ్యుడు బుద్ధుని విగ్రహం, మరోవైపు త్యాగాలు చేసిన అమర వీరుల స్మారక స్థూపం.. వీటి మధ్య శిఖరమంత ఎత్తున నిలిచిన అంబేద్కర్ మనల్ని నిత్యం చైతన్యపరుస్తూ పాలక వ్యవస్థకు నిత్య స్ఫూర్తివంతమై దారి చూపుతారని అన్నారు. 125 అడుగుల ఎత్తులో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహా విగ్రహాన్ని, శోభాయమానంగా.. తెలంగాణ సమాజంతో పాటు యావత్ దేశ ప్రజలు సంబురపడేలా గొప్పగా ఆవిష్కరించుకుందామని సీఎం కేసీఆర్ అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com