TS : ఆత్మీయ సమ్మేళనాలను సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు : కేటీఆర్

రాష్ట్రంలో ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్న తీరుపై మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఆధ్వర్యంలో 10 మందితో కూడిన కమిటీ ఏర్పాటైందని వెల్లడించారు. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్న తీరును పరిశీలిస్తుందన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు కమిటీకి సహకరించాలని కేటీఆర్ సూచించారు. ఈ కమిటీ ద్వారానే కేసీఆర్ పార్టీ కార్యక్రమాల అమలు పర్యవేక్షణ తీరు, వాటికి సంబంధించిన అభిప్రాయాలు తీసుకుంటారని వెల్లడించారు.
ఎన్నికల ఏడాదిలో ప్రతి ఎమ్మెల్యే అత్యంత చురుకైన పార్టీ కార్యకర్తలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఈ బృందం ద్వారా అటు పార్టీకి ప్రజలకు నిరంతరం సమాచారం అందించడంతో పాటు, పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు ఉపయోగించుకోవాలని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకుపోయేందుకు సోషల్ మీడియా కమిటీలు మరింత బలోపేతం చేసుకోవాలన్నారు.
ప్రతి ఆత్మీయ సమ్మేళనాన్ని కేసీఆర్ కార్యకర్తలకు రాసిన ఆత్మీయ సందేశంతోనే ప్రారంభించుకోవాలన్నారు కేటీఆర్. సీఎం ఆత్మీయ సందేశం ప్రతి కార్యకర్తకు అందేలా అవసరమైన కరపత్రాల వంటి మెటీరియల్స్ సిద్ధం చేసి విస్తృతంగా పంపిణీ చేసుకోవాలన్నారు. తెలంగాణ సాధించిన అభివృద్ధిపైన విస్తృతంగా మాట్లాడేందుకు ప్రజాప్రతినిధులు, వక్తలను ప్రత్యేకంగా ఇందుకు ఉపయోగించుకోవాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు, రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, అందివచ్చిన సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com