TS: తెలంగాణలో గ్రూప్‌వన్‌పై కీలక ప్రకటన

TS: తెలంగాణలో గ్రూప్‌వన్‌పై కీలక ప్రకటన
సుప్రీంకోర్టులో పిటిషన్‌ ఉప సంహరణకు ప్రభుత్వం నిర్ణయం... త్వరలో కొత్త నోటిఫికేషన్‌...

తెలంగాణ ప్రభుత్వం గ్రూప్‌ వన్‌ నోటిఫికేషన్‌పై కీలక ప్రకటన చేసింది. గతంలో టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకుంది. గ్రూప్ 1 పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని గత ఏడాది హైకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ ఉప సంహరించుకోవాలని రేవంత్‌ సర్కార్‌ నిర్ణయించుకుంది. ప్రస్తుతం మారిన పరిస్థితులతో కొత్తగా ఏర్పాటైన చైర్మన్, సభ్యులు గ్రూప్ 1పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు మరో వ్యాజ్యం సుప్రీంలో దాఖలు చేశారు. దాంతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి.


ఇటీవలే తెలంగాణ సర్కార్‌ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి కీల‌క నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విడుదల చేసిన 503 గ్రూప్-1 నోటిఫికేషన్‌కు అదనంగా మ‌రో 60 పోస్టులను భ‌ర్తీ చేసేందుకు అనుమ‌తి ఇచ్చింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 563కి చేరింది. ఈ పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్ వెలువడనుంది. గ‌తంలో 503 పోస్టుల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్ ఇచ్చింది. ఈ పోస్టులకు అదనంగా మరో 60 పోస్టుల‌ను క‌లుపుతూ వీలైనంత త్వర‌గా నోటిఫికేష‌న్ ఇవ్వాల‌ని రేవంత్‌రెడ్డి.... టీఎస్‌పీఎస్సీని ఆదేశించారు. 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గానూ గ‌తేడాది జూన్‌ 11న టీఎస్‌పీఎస్సీ ప్రిలిమ్స్ నిర్వహించగా... ఈ పరీక్ష రద్దు కోరుతూ కోర్టును పలువురు అభ్యర్థులు ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం ఈ పరీక్షను రద్దు చేసింది. ఈ పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తాజాగా కొత్తగా 60 పోస్టుల‌ను మంజూరు చేయ‌డంతో గ్రూప్‌-1 ప్రిలిమిన‌రీ మ‌ళ్లీ నిర్వహించే అవ‌కాశం ఉంది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రెండేళ్ల కింద అక్టోబరు 16న తొలిసారి ప్రిలిమ్స్‌ నిర్వహించారు. తరువాత ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేసింది. తరువాత మళ్లీ గత ఏడాది జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించింది. టీఎస్‌పీఎస్సీ వీరి నుంచి 1:50 నిష్పత్తిలో 25 వేల మందిని ఈ ఏడాది జనవరిలో మెయిన్స్‌కు ఎంపిక చేసింది. జూన్‌లో ప్రధాన పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూలు వెలువరించింది. అనూహ్యంగా ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించగా 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను కూడా కోర్టు రద్దు చేసింది. అయితే ఈ తీర్పుపై టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల, ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయింది. గ్రూప్ 1 ఉద్యోగాలకు 46 ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకునే విధంగా వయో పరిమితి సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తామని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story