SURYAPET: అమ్మ కన్నా ఆస్తే ఎక్కువైంది

సూర్యాపేట జిల్లాలో అమాయవీయ ఘటన చోటు చేసుకుంది. తల్లి అనంత లోకాలకు చేరినా... కుమారుడు, కూతుళ్ల మధ్య తెగని ఆస్తి పంచాయితీలతో అంత్యక్రియలే ఆగాయి. అంతిమ సంస్కారాలకు డబ్బులివ్వాలని కుమారుడు పట్టుబట్టడంతో ఇంట్లోనే తల్లి శవాన్ని ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. రక్త సంబంధాల కంటే ఆస్తుల పట్ల వ్యామోహమే ఎక్కువైపోతోంది. బంధాలు, అనుబంధాలు మాటలకే పరిమితమవుతున్నాయి. కన్నవారి మీద కనీస ప్రేమ కరువవుతోంది. నవమాసాలు మోసి రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను పెంచి పెద్ద చేసి... వృద్ధాప్యంలో తమకు ఆసరాగా నిలుస్తారని ఆశించిన కన్నపేగు కలలు కల్లలే అవుతున్నాయి. బతికుండగానే తల్లిదండ్రుల్ని సరిగా చూడని సంతానం... చనిపోయాక కూడా వారి ఆత్మలకు శాంతి లేకుండా చేస్తున్నారు.
సరిగ్గా ఇలాంటి సంఘటనే సూర్యాపేట జిల్లాలో జరిగింది. నేరేడుచర్ల మండలం కందులవారి గూడెంకి చెందిన వేం వెంకటరెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమారుడు చాలా రోజుల క్రితమే చనిపోగా...లక్ష్మమ్మ నేరేడుచర్ల లోని చిన్న కూతురు వద్ద ఉంటోంది. ఇటీవల ఇంట్లో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడటంతో లక్ష్మమ్మను మిర్యాలగూడలోనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఇంటికి పంపించటంతో బుధవారం మృతి చెందారు. మిగిలిన కూతుళ్లు ఆస్తి పంపకాలు తేలే వరకు అంబులెన్స్ తరలించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో లక్ష్మమ్మ దగ్గర ఉన్న 21 లక్షల రూపాయల్లోంచి ఆరు లక్షల్ని వైద్య ఖర్చుల నిమిత్తం చిన్న కూతురుకి ఇచ్చారు. మిగిలిన 15 లక్షల రూపాయల్ని కుమారుడు తీసుకున్నారు. 20 తులాల బంగారాన్ని ముగ్గురు కూతుళ్లకు పంచారు. చివరికి ఆస్తి పంపకాలు కొలిక్కి వచ్చినా... అంత్యక్రియల కోసం డబ్బులిస్తేనే తలకొరివి పెడతానంటూ కుమారుడు పట్టుబడుతుండటంతో చనిపోయి రెండ్రోజులు గడుస్తున్నా...తల్లి శవం ఇంట్లోనే ఉంది.మానవ సంబంధాలకే మచ్చ తెచ్చే ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. స్థానికంగా వస్తున్న విమర్శలతో అంత్యక్రియల నిర్వాహణపై చర్చలు జరుగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com