Telangana: బీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదు..

Telangana: బీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదు..
10 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందన్న నేత

పార్లమెంట్‌ ఎన్నికల్లో భారాసతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండబోదని భాజపా నేతలు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టిన కమలదళం.. నాలుగు చోట్ల రథయాత్రలు ప్రారంభించింది. మొత్తం ఐదు క్లస్టర్లలో యాత్ర చేపట్టనున్న భాజపా..114 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 5వేల 500ల కిలోమీటర్లు చుట్టేయనున్నారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు భాజపా సమర శంఖారావం పూరించింది. 17 లోక్‌సభ నియోజకవర్గాలను చుట్టేసేలా విజయ సంకల్ప యాత్రలు చేపట్టింది. ఐదు క్లస్టర్లుగా విభజించిన కమలదళం 4 క్లస్టర్లలో యాత్రలు షురూ చేసింది. నారాయణపేటలోని కృష్ణాలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల ప్రారంభించగా, భాజపా రాష్ట్రాధ్యక్షుడు కిషన్‌రెడ్డి శంఖారావం పూరించారు. కొమురం భీం క్లస్టర్‌లోని బాసరలో అసోం CM హిమంత బిశ్వశర్మ, రాజరాజేశ్వర క్లస్టర్‌లోని తాండూరులో కేంద్రమంత్రి BLవర్మ, బండి సంజయ్‌ ఆరంభించారు. భాగ్యలక్ష్మీ క్లస్టర్‌లో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ఆరంభించారు. మేడారం జాతర నేపథ్యంలో రెండ్రోజుల తర్వాత కాకతీయ భద్రకాళి క్లస్టర్‌లో యాత్ర మొదలు పెట్టనున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇక్కడి సంపదను దోచి దిల్లీకి పంపుతున్నారని భాజపా రాష్ట్రాధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కాయా, పీయా, చల్‌దీయా అనే రీతిలో భారాస సర్కార్‌ పనిచేసిందని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. పూర్తిస్థాయిలో గ్యారంటీలు అమలు చేయట్లేదని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మండిపడ్డారు. భైంసాలో విజయ సంకల్ప యాత్రను బిశ్వశర్మ ప్రారంభించగా ఎంపీ సోయం బాపురావు, MLAలు పాయల్ శంకర్, రామారావు, మహేశ్వరరెడ్డి, MLC లక్ష్మణ్‌ పాల్గొన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు చేసినట్లుగానే భాజపా 370 సీట్లు సాధిస్తుందని బండి సంజయ్‌ వెల్లడించారు. భారాసతో, భాజపా పొత్తు ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదని స్పష్టం చేశారు. విజయసంకల్ప యాత్రలో భాగంగా భాజపా.. 106 సమావేశాలు, 102 రోడ్‌షోలు నిర్వహించనుంది. మార్చి 2న ముగింపు సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.

Tags

Read MoreRead Less
Next Story