'నా భర్త నాకు కావాలి'.. భర్త ఇంటిముందు దీక్షకు దిగిన భార్య!

తన భర్త తనకి కావాలంటూ అత్తావారింటి ముందు దీక్షకు దిగింది ఓ ఇల్లాలు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లాలోని పెరుకవాడకు చెందిన అనూషను, హన్మకొండ యాదవనగర్ కు చెందిన హేమంత్ కి ఇచ్చి ఘనంగా 2015 మార్చి 31న వివాహం చేశారు. పెళ్ళిలో కట్నకానుకల కింద అనూష తల్లిదండ్రులు రూ.20 లక్షల నగదు, 50 తులాల బంగారాన్ని ఇచ్చారు. పెళ్లి తరవాత హేమంత్, అనూష బెంగళూరుకు వెళ్లారు. అక్కడ వారికి కొడుకు సాత్విక్ పుట్టాడు.
అయితే బంధువులు చెడు మాటల వలన సాత్విక్ తన కొడుకు కాదంటూ అనుమానిస్తూ అనూషను బెంగళూరు నుంచి వరంగల్కు పంపించాడు హేమంత్. అప్పటినుంచి కోర్టు ద్వారా పోరాటం చేస్తోంది అనూష. కోర్టు విచారణలో సాత్విక్ కు డీఎన్ఏ పరీక్షలు చేయగా అందులో సాత్విక్ హేమంత్ కుమారుడేనని తేలింది. అయినప్పటికీ హేమంత్ మారకపోవడంతో అనూష ఇంకా తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. గత మూడు రోజులుగా భర్త ఇంటి ఎదుట కూర్చొని న్యాయం కోసం ఎదురుచూస్తుంది. అనూషకు పలు మహిళా సంఘాలు, టీఆర్ఎస్ మహిళ నాయకులు అండగా నిలిచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com