27న యోగి, 28న నడ్డా, 29న అమిత్షా హైదరాబాద్ రాక

హైదరాబాద్ మేయర్ పీఠంపై గురిపెట్టిన కాషాయ దళం... గ్రేటర్ ఎన్నికల్లో విస్తృత ప్రచారంతో హోరెత్తిస్తోంది. ఇప్పటికే... రాష్ట్ర బీజేపీ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇప్పుడు గ్రేటర్ గల్లీల్లో ఢిల్లీ బీజేపీ నేతలు ప్రచారం చేయబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో పర్యటించిన కేంద్ర మంత్రి జవదేకర్ టీఆర్ఎస్ సర్కార్పై ఛార్జ్షీట్ విడుదల చేశారు. మరోకేంద్ర మంత్రి స్మృతి ఇరానీ... తెలంగాణ సర్కార్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు..
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. జాతీయ నేతలను ప్రచార బరిలో దించుతోంది బీజేపీ హైకమాండ్. ఈ నెల 27న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల మీదుగా పాతబస్తీలోని చంద్రాయణగుట్ట, చార్మినార్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. 28న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ మీదుగా మల్కాజిగిరి వరకు నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. 29న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో తార్నాక నుంచి అంబర్పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్ మీదుగా సికింద్రాబాద్ వరకు నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. ఇప్పటికే రాష్ట్ర నేతల... తమ మాటల తూటాలతో.. ప్రచారాన్ని వేడెక్కించారు. ఇప్పుడు బీజేపీ అగ్రనేతలు సైతం వస్తుండటంతో కమలశ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. రాష్ట్ర నేతలతో మాటల తూటలతో జోరు మీదున్న కమలదండు జాతీయ అగ్రనేతల రాకతో మరింత వాడివేడిగా మారనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com