యంగ్ టాలెంట్ కు చెర్రీ సువర్ణ అవకాశం

RRRతో ప్రపంచవ్యాప్తంగా పేర ప్రఖ్యాతలు సంపాదించుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో విన్నూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. యువీ క్రియేషన్స్లోని తన స్నేహితుడు విక్రమ్ రెడ్డితో చేతులు కలిపిన చెర్రీ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తాపత్రయ పడుతున్న యువతకు సువర్ణ అవకాశం కల్పించేందుకు నడుం బిగించాడు. కొత్త కాన్సెప్ట్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్ను ప్రారంభించారు. పాన్ ఇండియా ప్రేక్షకులు మెచ్చేలా విలక్షణమైన చిత్రాలను ఈ సంస్థ రూపొందించనుంది. ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్లో విలక్షణమైన కథాంశాలతో పాటు, మంచి వినోదాన్ని ప్రేక్షకులకు అందిచేందుకు సిద్ధంగా ఉంది. చిత్ర కళ పట్ల విపరీతమైన ఆరాధన, అసాధారణమైన ఆసక్తితో పాటు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందించాలనే ఆలోచన ఉన్న టీమ్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణ సంస్థ ముందుకు సాగనుంది. ఇప్పటివరకూ అవకాశాలు లేక వెనుకబడిన వారిని గుర్తించి ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ టీమ్ ముందుకు సాగుతోంది. ఈ సందర్బంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ‘‘మా ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్ విలక్షణమైన ఆలోచనలను ఆవిష్కరిస్తూ సరికొత్త, వైవిధమ్యైన వాతావరణాన్ని పెంపొందించటానికి సిద్దంగా ఉన్నాం. సృజనాత్మకతతో సినిమా సరిహద్దులను చెరిపేస్తాం. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అభివృద్ధి చెందుతోన్న టాలెంట్ని ఇండస్ట్రీకి పరిచయం చేసి ఓ సరికొత్త ప్రభావాన్ని చూపించటమే లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అన్నారు. యువీ క్రియేషన్స్ విక్రమ్ మాట్లాడుతూ ‘‘ఈ సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించటం అనేది మాలో తెలియని ఆనందాన్ని కలిగిస్తోంది. ఎంతో ప్రతిభ ఉన్న నటీనటులు, రచయితలు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో కలిసి "వి మెగా పిక్చర్స్" పని చేయనుంది. వెండితెరపై చూపించబోయే స్టోరీ టెల్లింగ్లో ఓ కొత్త ఒరవడిని తీసుకు రావాలనుకుంటున్నాం. దీని వల్ల సినీ ఇండస్ట్రీ హద్దులు చెరిపేయటమే మా లక్ష్యం’’ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com