Puneeth Rajkumar James : పునీత్ చివరిచిత్రం కోసం లేటెస్ట్ టెక్నాలజీ.. అప్పు వాయిస్ తోనే రిలీజ్..!
Puneeth Rajkumar James : కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ అకాల మరణం కేవలం కన్నడ అభిమానులను మాత్రమే కాదు.. యావత్ భారతీయ సినీ ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించింది. పునీత్ ఇక లేరన్న వార్తను ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలావుండగా పునీత్ హఠాన్మరణంతో ఆయన చివరిగా సంతకం చేసిన రెండు సినిమాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి.
మరణించే సమయానికి పునీత్ 'జేమ్స్' షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. ఆయనకీ సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపొయింది. డబ్బింగ్ మిగిలిపోయింది. దాదాపు 60 కోట్ల రూపాయలు బడ్జెట్తో తెరకెక్కిస్తోన్న జేమ్స్ మూవీలో పునీత్ బాడీ బిల్డర్గా కనిపించనున్నారు. ఈ సినిమాని ఎంతగానో ఓన్ చేసుకున్న పునీత్ అలా కనిపించేందుకు జిమ్లో బాగానే కష్టపడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటుతో ఆయన మరణించారు. దీనితో ఆయన చేస్తోన్న ఈ సినిమా పైన సంద్ధిగత నెలకొంది.
అభిమానుల కోసం ఈ సినిమాని పునీత్ పుట్టినరోజు అయిన 2022 మార్చి 17న జేమ్స్ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో పునీత్ వాయిస్ కాకుండా వేరే వాయిస్తో డబ్బింగ్ చెప్పిస్తే.. అభిమానులు నిరాశకి గురవుతారని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఇందుకోసం ముంబైకి చెందిన ఓ ఐటీ కంపెనీని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ టెక్నాలజీ 'జేమ్స్' షూటింగ్ సమయంలో పునీత్ రాజ్కుమార్ చెప్పిన డైలాగ్స్ క్వాలిటీ పెంచి విజువల్స్కు సింక్ చేసే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. పునీత్ తో 'రాజకుమార' అనే సూపర్ హిట్ సినిమా తీసిన చేతన్ కుమార్ 'జేమ్స్' కు దర్శకుడు. ఈ సినిమా పైన అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com