Tollywood : ఇండస్ట్రీలో మరో విషాదం.. వల్లభనేని కన్నుమూత
ఇండస్ట్రీలో మరో విషాదం.. వల్లభనేని కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత వల్లభనేని జనార్దన్ అనారోగ్యంతో మృతి చెందారు. ఇటీవల అనారోగ్య సమస్యతో అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. ఈయన వయసు 63 సంవత్సరాలుకాగా, దాదాపు 100 వందకు పైగా సినిమాలలో నటించారు.
1959 సెప్టెంబర్ 25న ఏలూరు దగ్గర పోతునూరులో వల్లభనేని జనార్దన్ జన్మించారు. విజయవాడ లయోలా కాలేజ్ లో చదివిన జన్నార్ధన్ కు చిన్నతనం నుంచి సినిమాలంటే అమిత ఇష్టం. ఆ మక్కువతోనే సొంత సంస్థను స్థాపించి పలు సినిమాలను నిర్మించారు. అంతేకాకుండా చంద్రమోహన్ హీరోగా 'అమాయక చక్రవర్తి', శోభన్ బాబు హీరోగా 'తోడు-నీడ' వంటి మంచి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఒకానొక సమయంలో ఆర్టిస్టులు సహకారం ఇవ్వకపోవడంతో ఏకంగా తానే నటుడిగా మారి ఎన్నో మూవీస్ లో నటించారు.
ముఖ్యంగా విజయబాపినీడు దర్శకత్వంలో రూపొందిన అనేక చిత్రాలలో వల్లభనేని జనార్దన్ నటునిగా రాణించారు. చిరంజీవి 'గ్యాంగ్ లీడర్'లో హీరోయిన్ తండ్రి పాత్రలో వల్లభనేని నటనకు విశేషాదరణ లభించింది. అనంతరం వందకు పైగా చిత్రాల్లో పలు పాత్రలను పోషించారు.
మెగాస్టార్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి నటీనటుల సినిమాల్లో అభినయించారు. ఇక 'అన్వేషిత' వంటి సీరియల్స్ లోనూ నటించి మెప్పించారు జనార్థన్. ఆయనకు ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. మొదటి అమ్మాయి శ్వేత చిన్నతనంలోనే చనిపోగా, రెండో కూతురు అభినయ ఫ్యాషన్ డిజైనర్ గా కొనసాగుతుంది. కొడుకు అవినాశ్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com