Kshama Bindu: దేశంలో తొలి సోలో మ్యారేజ్.. అనుకున్న దానికంటే రెండ్రోజులు ముందే..
Kshama Bindu: దేశంలో తొలి సోలోగమీ వివాహం జరిగింది. గుజరాత్ లోని వడోదరలో క్షమా బిందు అనే యువతి తనను తానే పెళ్లి చేసుకుంది. ఇలా ఎవరిని వారే పెళ్లి చేసుకోవడాన్ని సోలోగమీ అంటారు. గోత్రి పట్టణంలోని ఓ ఆలయంలో జూన్ 11న పెళ్లి చేసుకుంటానని.. క్షమా బిందు తొలిత ప్రకటించింది. వెడ్డింగ్ కార్డులు కూడా ప్రింట్ చేయించింది. అయితే ఆలయంలో ఇలాంటి పెళ్లిళ్లకు అనుమతి లేదని చెప్పడంతో పాటు.. ఈ పెళ్లిని తప్పుబట్టిన కొందరు వ్యక్తులు అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో అనుకున్న ముహూర్తం కంటే రెండు రోజుల ముందే.. అత్యంత సన్నిహుతుల సమక్షంలో ఇంట్లోనే వివాహం చేసుకుంది.
సోలోగమీ వివాహమే అయినా.. సప్రదాయం ప్రకారం అన్ని వేడుకలు చేసుకుంది క్షమ. హల్దీ, మెహందీ కార్యక్రమాలతో పాటు వేదమంత్రాల నడుమ.. ఒంటరిగా ఏడడుగులు నడిచి.. తానే సింధూరాన్ని ధరించి వివాహితగా మారింది. ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న క్షమ.. తన పెళ్లి కోసం కొన్ని వారాల పాటు సెలవు కూడా పెట్టుకుంది. తన జీవితంలో తాను ఎవరినీ పెళ్లి చేసుకోవాలనుకోలేదని.. కానీ పెళ్లి కూతురిని కావాలన్న కోరికతో తనను తానే పెళ్లి చేసుకునట్లు క్షమ వివరించింది.
స్వీయ వివాహమంటే మన కోసం మనం కట్టుబడి ఉండటమని తెలిపింది. మనపై మనం చూపించే షరతులు లేని ప్రేమకు ఇది నిదర్శనమని క్షమ అంటోంది. చిన్నతనం నుంచి తనకు స్వతంత్రంగా ఉండటమంటేనే ఇష్టమని.. అందుకే తనను తాను వివాహం చేసుకున్నానని తెలిపింది. క్షమ బిందు తల్లిదండ్రులిద్దరూ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. తండ్రి దక్షిణాఫ్రికాలో ఉంటుండగా.. తల్లి అహ్మదాబాద్లో ఉంటున్నారు. స్నేహితుల సమక్షంలో జరిగిన తమ కూతురు పెళ్లికి వారు వీడియోకాల్ ద్వారా హాజరయ్యారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com