హ్యాట్సాఫ్ పోలీసన్న.. ప్రయాణికుడి ప్రాణాలను కాపాడావు..!

ఓ రైల్వే అధికారి వేగంగా స్పందించి ఓ ప్రయాణికుడి ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి.. తన రెండు చేతుల్లో సామానుతో కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించాడు. ముందుగా తన చేతిలో ఉన్న సామాన్లను రైల్లో వేసి అనంతరం తానూ రైలు ఎక్కబోయాడు. ఇంతలో అతని అడుగు తడబడడంతో కాలు జారి ప్లాట్ఫాం, రైలుకు మధ్య ఉన్న సందులోకి పడిపోయాడు.
ఈ క్రమంలో అతని వెనుకాలే ఉన్న మరో ప్రయాణికుడు, అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ పోలీసు కానిస్టేబుల్ రాజ్వీర్ సింగ్ వెంటనే స్పందించి అతడిని పైకి లాగేందుకు ప్రయత్నించారు. కానీ పట్టు దొరకకపోవడంతో అతడిని రైలు మరికొద్ది దూరం లాక్కెళ్లింది. అయినప్పటికీ రాజ్వీర్ సింగ్ మళ్లీ వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లి అతడిని ప్లాట్ఫాంపైకి లాగేశారు.. దీనితో అతను ప్రాణాల నుంచి బయటపడ్డాడు.
ఇదంతా చూస్తున్న రైల్లోని ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికుడిని ప్రాణాలను కాపాడిన రాజ్వీర్ సింగ్ను అభినందిస్తూ ఈ వీడియోను ఆర్పీఎఫ్ పోలీసులు ట్విట్టర్లో పోస్టు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com