కెనడాని వణికిస్తోన్న కార్చిచ్చు

కెనడాని మహాకార్చిచ్చు వణికిస్తోంది. తూర్పు ప్రాంతంలో చెలరేగిన దావానలం.... వేగంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతం 250 ప్రాంతాల్లో మంటలు తీవ్రంగా ఉండగా.. అందులో 150 క్యుబెక్ ప్రావిన్స్లోనే వ్యాపించాయి. దేశ చరిత్రలోనే ఇది అత్యంత దారుణ కార్చిచ్చు అని ప్రకటించారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. ఇప్పటివరకు 3.8 మిలియన్ హెక్టార్ల అటవీ ప్రాంతం దగ్ధమైంది.
ప్రస్తుతం 5వ నంబరు హెచ్చరిక జారీ చేశారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన బృందాలు మంటలను అదుపు చేయడంలో సహాయపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్ 600పైగా ఫైర్ ఫైటర్స్, సిబ్బందిని పంపించారు. కెనడా ప్రధాని ట్రూడోకు ఫోన్ చేసి కావాల్సిన సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
కెనడాలోని 13 ప్రావిన్స్లలో దాదాపు ఆరు వారాల కిందట మెల్లగా మొదలైందీ దావానలం. ఆర్పకుండా పడేసిన సిగరెట్ పీకలు, రైళ్ల రాకపోకల సందర్భంగా వచ్చే నిప్పు రవ్వలే కారణమని తెలుస్తోంది. నిజానికి వాతావరణ మార్పులు, సతత హరిత అరణ్యాలు ఉండే పశ్చిమ కెనడాలో వేసవిలో కార్చిచ్చు రేగుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com