Operation Sindhu: ఇరాన్ నుంచి భారత్కు చేరిన 110 మంది విద్యార్థులు

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు (Operation Sindhu) ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం గురువారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. టెహ్రాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్న వెళ, ఈ విద్యార్థులను ఉత్తర ఇరాన్ నుంచి అర్మేనియా రాజధాని యెరవాన్కు జూన్ 17న తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో భారత్కు తీసుకువచ్చారు. వారిలో 90 మంది జమ్ముకశ్మీర్కు చెందిన వారే ఉన్నారు. వీరంతా ఉర్మియా మెడికల్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.
ఢిల్లీలో దిగిన తర్వాత అమన్ అజార్ అనే విద్యార్థి ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కుటుంబాన్ని కలిసిన తర్వాత నాకు ఎలా అనిపిస్తుందో మాటల్లో చెప్పలేను. ఇరాన్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడి ప్రజలు కూడా మనలాగే ఉన్నారు, చిన్న పిల్లలు బాధపడుతున్నారు. యుద్ధం ఎవరికీ మంచిది కాదు. ఇది మానవత్వాన్ని నాశనం చేస్తుంది’ అని చెప్పారు.
ఇరాన్లో సుమారు 13 వేల మందికిపైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. వారిలో అత్యధికులు వైద్య విద్యనే అభ్యసిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఇతర పౌరులు సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ఇరాన్ అధికారులతో కలిసి పనిచేస్తున్నది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com