Nigeria Floods: : నైజీరియాలో వరద బీభత్సం... వంద మందికి పైగా మృతి

Nigeria Floods: : నైజీరియాలో వరద బీభత్సం... వంద మందికి పైగా మృతి
X
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన

పశ్చిమాఫ్రికా దేశం నైజీరియాలో భారీ వర్షాలు, వరదలు తీవ్ర విషాదాన్ని సృష్టించాయి. గురువారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీనికి తోడు ఓ భారీ డ్యామ్ కుప్పకూలడంతో వరద ఉద్ధృతి ఊహించని విధంగా పెరిగి, పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటివరకు 111 మంది మృతి చెందినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

నైజీరియాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. భారీ వరదల ప్రవాహానికి ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. అనేకమంది నివాసాలు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం సాయంత్రం నాటికి 111 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. వేలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

నైజీరియాకు ఇలాంటి వరదలు కొత్తేమీ కాదు. గత ఏడాది సెప్టెంబరులో కూడా ఇలాంటి భయానక వరదల కారణంగా ఆనకట్టలు తెగిపోయి సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో కూడా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దేశంలో ఇప్పటికే బోకో హరామ్ వంటి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాల వల్ల మానవతా సంక్షోభం నెలకొంది. తాజా వరదలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వాతావరణ మార్పుల కారణంగానే నైజీరియా తరచుగా తీవ్ర వరదలను ఎదుర్కొంటోందని, స్వల్ప వ్యవధిలోనే అధిక వర్షపాతం నమోదై భారీ నష్టాన్ని కలిగిస్తోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుత వర్షాలు కూడా అదే కోవలోకి వస్తాయని, ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో ఊహించని స్థాయిలో వరదలు సంభవించి భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు చేపట్టినా, నష్టం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సాధారణ పరిస్థితి నెలకొనడానికి సమయం పట్టే అవకాశం ఉంది.

Tags

Next Story