Cop28: కాప్-28 వేదికపై మణిపూర్ బాలిక నిరసన

Cop28: కాప్-28 వేదికపై మణిపూర్ బాలిక నిరసన
శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా వేదికపై ప్లకార్డు ప్రదర్శన

భూగోళంపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని నియంత్రించడమే లక్ష్యంగా దుబాయ్‌లో జరుగుతున్న కాప్‌-28 సమావేశాల్లో మంగళవారం కలకలం చెలరేగింది. మణిపూర్‌కు చెందిన లిసిప్రియా కాంగుజమ్‌ అనే 12 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా చర్చా వేదికపైకి వచ్చి పెట్రోల్‌, డీజిల్‌ వంటి శిలాజ ఇంధనాల వాడకానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. అంతేగాక శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా వేదికపై ప్లకార్డును ప్రదర్శించింది.

ఇదిలావుంటే.. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం కారణంగా భూమి సగటు ఉష్ణోగ్రతలు అంతకంతకే పెరిగిపోతున్నాయి. అంతేకాదు, ఈ పరిణామం ఫలితంగా భవిష్యత్తులో అనూహ్యమైన వాతావరణ మార్పులు చోటుచేసుకుంటాయని, సముద్ర మట్టాలు పెరిగిపోయి తీర ప్రాంతాల్లోని ముంబై వంటి నగరాలు మునిగిపోతాయని శాస్త్రవేత్తలు చాలాకాలం నుంచి హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో లిసిప్రియ శిలాజ ఇంధనాలపై తన వ్యతిరేకతను స్పష్టంచేస్తూ నినాదాలు చేయడంతో కొంత సమయం అక్కడ గందరగోళం నెలకొంది.

సదస్సులో వీక్షకుల మధ్య నుంచి లిసిప్రియా ప్లకార్డుతో వేదికపైకి దూసుకెళ్లి.. శిలాజ ఇంధనాలకు వ్యతిరేకంగా మాట్లాడింది. అయితే, కొద్దిసేపటి తర్వాత నిర్వాహకులు సర్దిచెప్పి ఆమెను కిందకు పంపించే ప్రయత్నం చేశారు. కానీ వారి మాటను లెక్కచేయకుండా వేదికపై అటూ ఇటూ తిరుగుతూ తన ప్రసంగాన్ని కొనసాగించింది. దీంతో సిబ్బంది ఆమెను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లాల్సి వచ్చింది. కానీ, ఆ చిన్నారి ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. ఆలోచింపజేసే ఆ ప్రసంగానికి వీక్షకుల అభినందనలు దక్కాయి. ఈ సంఘటనపై కాప్ 28 డైరెక్టర్ జనరల్ అంబాసిడర్ మజిద్ అల్‌ సువైదీ స్పందిస్తూ.. ఆ చిన్నారి ఉత్సాహాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని అన్నారు.

నిరసన అనంతరం లిసిప్రియ ట్విట్టర్‌ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది . ‘నేను నిరసన తెలియజేసినందుకు వారు నన్ను 30 నిమిషాల పాటు అదుపులోకి తీసుకున్నారు. శిలాజ ఇంధనాలు వాడొద్దని చెప్పడమే నేను చేసిన నేరం. మీరు నిజంగా శిలాజ ఇంధనాలను వ్యతిరేకిస్తే నాకు మద్దతివ్వండి. నిబంధలకు విరుద్ధంగా ఐక్యరాజ్యసమితి ప్రాంగణంలోనే బాలల హక్కుల ఉల్లంఘన జరిగింది’ అంటూ ఐరాస సెక్రెటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ను ట్విట్టర్‌లో ట్యాగ్ చేసింది.

నవంబర్‌ 30 నుంచి డిసెంబరు 12 వరకూ జరిగే కాప్‌ 28 సదస్సుకు 190 దేశాల నుంచి 60 వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. మణిపూర్ చిన్నారి లిసిప్రియా తూర్పు తైమూర్‌ ప్రత్యేక రాయబారిగా సదస్సుకు హాజరైంది. చిన్నవయసు నుంచే వాతావరణ మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్ వంటి అంశాలపై ఉద్యమిస్తోంది. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఉపన్యాసాలిచ్చింది. ‘క్లైమేట్‌ ఛేంజ్‌ లా’ తీసుకురావాలంటూ భారత పార్లమెంటు ఎదుట ప్లకార్డులు ప్రదర్శించి గళం వినిపించింది. అంతేకాదు, ‘వరల్డ్‌ చిల్డ్రన్‌ పీస్‌ ప్రైజ్‌ 2019కు ఎంపికయ్యింది.

Tags

Read MoreRead Less
Next Story