Israel-Hamas War: ఆగిన కాల్పుల విరమణ.. గాజాపై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం..

Israel-Hamas War: ఆగిన కాల్పుల విరమణ..  గాజాపై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం..
178 మంది పాలస్తీనా ప్రజలు మృతి

వారంరోజుల కాల్పుల విరమణ తర్వాత గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది. హమాస్‌ స్థావరాలపై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలతో దాడులు ప్రారంభించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని హమాస్‌ ఉల్లంఘించినట్లు ఆరోపించింది. గాజా నుంచి తమ భూభాగంపై రాకెట్‌ దాడులు జరిగినట్లు పేర్కొంది. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్‌ వందమందికిపైగా బందీలను వదిలిపెట్టగా ఇజ్రాయెల్‌ 240 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది.

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియటంతో ఉదయం నుంచి గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది. హమాస్‌ను నిర్మూలించాలన్న తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు దాడులు పునరుద్ధరిస్తామన్న ప్రకటించిన ఇజ్రాయెల్‌ ఉదయం 7గంటలకు కాల్పుల విరమణ ఒప్పంద గడువు ముగిసిన అరగంట

తర్వాత దాడులు ప్రారంభించినట్లు ప్రకటించింది. గాజా స్ట్రిప్‌లోని హమాస్‌ స్థావరాలపై యుద్ధ విమానాలతో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ మిలిటరీ తెలిపింది. ఖాన్‌ యూనిస్ పట్టణానికి తూర్పున ఉన్న అబాసాన్ కమ్యూనిటీసహా దక్షిణ గాజాపై వైమానిక దాడులు జరిగినట్లు.... హమాస్ అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. గాజా నగరానికి వాయవ్యంగా ఉన్న ఓ నివాసంపై కూడా దాడి జరిగినట్లు పేర్కొంది.


కాల్పుల విరమణ ఒప్పందాన్ని హమాస్‌ ఉల్లంఘించినట్లు ఇజ్రాయెల్‌ ఆరోపించింది. ఒప్పందం సమయంలోనే గాజా నుంచి రాకెట్‌ దాడులు జరిగాయని పేర్కొంది. ఉత్తరగాజాలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు, కాల్పుల చప్పుళ్లు వినిపించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా....జెరూసలెంలో గురువారం ఉదయం ఉగ్రదాడి జరిగింది. ఇద్దరు పాలస్తీనా సాయుధులు బస్టాప్‌లో ఉన్న వారిపై కాల్పులు జరపటంతో.... ముగ్గురు మృతి చెందటంతోపాటు ఆరుగురు గాయపడ్డారు. మరోవైపు కాల్పుల విరమణ చివరిరోజు తమ వద్ద ఉన్నబందీల్లో మరో 8మందిని

హమాస్‌ వదిలిపెట్టగా అందుకు బదులుగా ఇజ్రాయెల్‌ 30మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. తెల్లవారుజామున గాజాస్ట్రిప్‌ చేరుకున్న పాలస్తీనా ఖైదీలకు స్థానికులు, వారి కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. హమాస్‌ జెండాలను పట్టుకొని నినాదాలు చేశారు. గతనెల 24న ఇరువర్గాల మధ్య కుదిరిన వారంరోజుల కాల్పుల విరమణ ఒప్పందం సందర్భంగా హమాస్‌ వంద మందికిపైగా బందీలను వదిలిపెట్టగా ఇజ్రాయెల్‌ 240 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది.

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అక్టోబర్‌ 24న జరిగింది. మొదట నాలుగు రోజులే ఒప్పందం చేసుకున్నప్పటికీ, తర్వాత బందీల విడుదల కోసం మరో మూడు రోజులు పెంచారు. దీంతో ఇరువైపుల నుంచి దాడులు జరగలేదు. ఈ ఏడు రోజుల్లో గాజాకు మానవాతా సాయం అందడంతోపాటు ఇరుపక్షాల మధ్య బందీల విడుదల జరిగింది. అయితే గడువు శుక్రవారం ఉదయంతో ముగియడంతో కాల్పుల విరమణను ఇంకొన్నిరోజులపాటు కొనసాగించాలని అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ కాల్పులు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గాజాలో మరోసారి మారణహోహం కొనసాగుతున్నది.

Tags

Next Story