TERRORIST: భారత్‌కు కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌!

TERRORIST: భారత్‌కు కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌!
X
ఊచలు లెక్క పెట్టించేందుకు సిద్ధమవుతున్న భారత్‌.. పాక్‌కు భారత్‌ అధికారిక అభ్యర్థన

భారత్‌లో విధ్వంసం సృష్టించడమే పనిగా పెట్టుకున్న కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్‌ సయీద్‌ను భారత్‌కు రప్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో ఎన్నో పేలుళ్లకు కుట్ర రచించి...అమాయకులను పొట్టనబెట్టుకున్న ఈ నరరూప రాక్షసుణ్ని దేశానికి రప్పించి ఊచలు లెక్కబెట్టించేందుకు..చట్టపర ప్రక్రియ ప్రారంభం అయినట్లు సమాచారం. కరడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది లష్కరే తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ను భారత్‌కు రప్పించిఊచలు లెక్కపెట్టించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎంతోమంది అమాయకుల ఉసురు తీసిన ఈ ముష్కరుడిని భారత్‌కు రప్పించేందుకు చట్టపరమైన ప్రక్రియ వేగవంతమైనట్లు తెలుస్తోంది.

హఫీజ్‌ సయీద్‌ను భారత్‌కు అప్పగించాలని పాకిస్థాన్‌ను భారత్‌ అధికారికంగా అడిగినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. హఫీజ్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ భారత విదేశాంగ మంత్రిత్వశాఖ పాక్‌ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థన పంపినట్లు పేర్కొన్నాయి. దీనిపై ఇప్పటికైతే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ముంబయి పేలుళ్ల కేసులో విచారణ ఎదుర్కొనేందుకు అతడిని తమకు అప్పగించాలని భారత్‌ ఎన్నోసార్లు డిమాండ్‌ చేసింది. కానీ, భారత్‌-పాక్‌ మధ్య ఖైదీల అప్పగింత ఒప్పందం లేకపోవడంతో ఈ ప్రక్రియ క్లిష్టంగా మారింది.

2008 నవంబరు 26న ముంబయిలో ఉగ్రమూకలు మారణహోమం సృష్టించిన విషాదం వెనుక హఫీజ్‌ సయీద్‌ కీలక సూత్రధారిగా ఉన్నాడు. ఈ దారుణంతోపాటు మరెన్నో ఉగ్రదాడుల్లో హఫీజ్‌ సయీద్‌ కీలక సూత్రధారిగా ఉన్నాడు. భారత్‌లో మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాదుల్లో ఒకడైన సయీద్‌ను.. ఐక్యరాజ్య సమితి కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి తలపై 10 మిలియన్‌ డాలర్ల రివార్డ్‌ ప్రకటించింది. వీటితో పాటు ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందించారన్న ఆరోపణలతో పలు మనీలాండరింగ్‌ కేసుల్లోనూ హఫీజ్‌పై ఎన్నో కేసులు ఉన్నాయి. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నారన్న కేసులు సహా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న హఫీజ్‌ 2019లో అరెస్టయ్యాడు. ఈ కేసులకు సంబంధించి అతడికి 31 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం పాక్‌ జైల్లో ఉన్న హఫీజ్‌.. అక్కడి నుంచే దేశ రాజకీయాలను శాసిస్తున్నట్లు పలు కథనాలు చెబుతున్నాయి. సయీద్‌ ఏర్పాటు చేసిన ‘ది పాకిస్థాన్‌ మర్కజీ ముస్లిం లీగ్‌’పార్టీ.. వచ్చే ఏడాది జరగబోయే పాక్‌ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఇదే పార్టీ తరఫున హఫీజ్‌ తనయుడు తల్హా సయీద్‌ ఎన్‌ఏ-127 స్థానం నుంచి బరిలోకి దిగుతున్నాడు.

Tags

Next Story