Israel: మానవతా సహాయ కేంద్రం వద్ద ఇజ్రాయెల్ కాల్పులు.. 31 మంది మృతి

గాజాలోని సహాయ కేంద్రం దగ్గర జరిగిన కాల్పుల్లో 31 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 80 మంది గాయపడ్డారు. ఆకలితో అలమిటిస్తున్న అమాయక ప్రజలను ఇజ్రాయెల్ ఊచకోత కోసిందని హమాస్ ఆరోపించింది. ఆ సహాయ కేంద్రాలు మానవతా సహాయ కేంద్రాలు కాదని.. సామూహిక ఊచకోతలు అని హమాస్ ఆరోపించింది.
ఆదివారం దక్షిణ గాజాలోని రఫా ప్రాంతంలో అమెరికా, ఇజ్రాయెల్ మద్దతు ఉన్న గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (జీహెచ్ఎఫ్) పంపిణీ కేంద్రం దగ్గర ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడి ఉన్నారు. పంపిణీ చేస్తున్న సాయాన్ని ప్రజలు అందుకుంటున్నారు. ఒక్కసారిగా కాల్పులు జరగడంతో అక్కడికక్కడే 31 మంది పాలస్తీనియర్లు ప్రాణాలు కోల్పోయారు. 80 మందికి పైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ ట్యాంకులు.. ప్రజలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిందని ఆరోపించింది.
అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వర్గాలు ఖండించాయి. అలాగే ఇజ్రాయెల్ మాజీ ప్రధాన మంత్రి నఫ్తాలి బెన్నెట్ కూడా ఖండించారు. ప్రపంచ మీడియా పెద్ద అబద్ధాన్ని క్రియేట్ చేసిందని పేర్కొన్నారు. అలాంటి కాల్పులు ఏం జరగలేదని.. అదంతా కేవలం అబద్ధమని తెలిపారు. గాజాలో తమ సహాయ పంపిణీకి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిందని జీహెచ్ఎఫ్ తెలిపింది. పౌరులపై దాడి జరిగిందన్న హమాస్ ఆరోపణలను ఖండించింది.
ఇజ్రాయెల్, అమెరికా మద్దతు ఉన్న ప్రైవేటు సంస్థ జీహెచ్ఎఫ్ మే 26 నుంచి గాజాలో ఆహారాన్ని పంపిణీ చేస్తోంది. అయితే జీహెచ్ఎఫ్.. ఇజ్రాయెల్ కోసం పని చేస్తోందని.. జనాలను గుమిగూడేలా చేసి అనంతరం కాల్పులు జరిగేలా ప్లాన్ చేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఐక్యరాజ్యసమితి.. జీహెచ్ఎస్ యంత్రాంగంపై విమర్శలు గుప్పించింది. మానవతా సూత్రాలను జీహెచ్ఎఫ్ ఉల్లంఘిస్తోందని.. పాలస్తీనియన్లకు ప్రమాదాలను సృష్టిస్తోందని ఐక్యరాజ్యసమితి ఆరోపించింది. ఇజ్రాయెల్ లక్ష్యాలను తీర్చడానికే జీహెచ్ఎఫ్ పని చేస్తోందని పెద్ద ఎత్తున ఇతర సంస్థల నుంచి కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణపై హమాస్తో చర్చలు జరుపుతోంది. అయితే ఈ చర్చలు కొలిక్కి రాలేనట్లుగా తెలుస్తోంది. పూర్తిగా ఇజ్రాయెల్ కాల్పుల విరమణ చేయాలని హమాస్ పట్టుబడుతోంది. అయితే చర్చలు అసంపూర్తినే ముగిశాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com