Middle East tensions: మధ్యప్రాచ్యంలో గగనతల ఆంక్షలతో విమానాల రద్దు, 444 విమానాలు రద్దయ్యే అవకాశం

Middle East tensions: మధ్యప్రాచ్యంలో గగనతల ఆంక్షలతో విమానాల రద్దు,  444 విమానాలు రద్దయ్యే అవకాశం
X
నిన్న 410 సర్వీసులు రద్దు చేసిన దేశీయ సంస్థలు

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇరాన్, మరికొన్ని దేశాల గగనతలాన్ని మూసివేయడంతో విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ క్రమంలో మార్చి 1న దాదాపు 444 విమానాలు రద్దయ్యే అవకాశం ఉందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. ఇదే కారణంతో ఫిబ్రవరి 28న దేశీయ విమానయాన సంస్థలకు చెందిన 410 సర్వీసులు రద్దయ్యాయి.

ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, విమానాల మళ్లింపును సమర్థంగా నిర్వహించేందుకు ప్రధాన విమానాశ్రయాలను అప్రమత్తం చేసినట్టు డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు సహాయం అందించడం, టెర్మినల్స్‌లో రద్దీని నియంత్రించడం వంటి చర్యలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొంది. మరోవైపు, కేంద్ర పౌరవిమానయాన శాఖ ఏర్పాటు చేసిన ప్యాసింజర్ అసిస్టెన్స్ కంట్రోల్ రూమ్ (పీఏసీఆర్) ప్రయాణికుల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.

శనివారం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభించిన నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో గగనతల ఆంక్షలు విధించారు. దీంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఎప్పటికప్పుడు మార్గాలను మార్చుకోవాలని భారత విమానయాన సంస్థలకు పౌరవిమానయాన శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అన్ని విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్, పార్కింగ్, ప్రయాణికుల సౌకర్యాల విషయంలో ఎయిర్‌లైన్స్‌తో సమన్వయం చేసుకోవాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), ప్రైవేట్ ఆపరేటర్లకు సూచించారు. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, ప్రయాణికుల భద్రతే తమకు అత్యంత ముఖ్యమని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Tags

Next Story