USA: అమెరికాలో కాల్పులు.. 8 మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. తుపాకీ మోతతో దద్దల్లింది. ఇల్లినాయిస్లోని చికాగోలో రెండు ఇళ్లపై కాల్పులు జరిపిన ఓ దుండగుడు ఎనిమిది మంది ప్రాణాలు తీశాడు. ఆది, సోమవారాల్లో రెండు వేర్వేరు ఇళ్లలో సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడని అధికారులు తెలిపారు. కాల్పుల అనంతరం అక్కడి పరారయ్యాడని పోలీసు అధికారులు వెల్లడించారు. దుండగుడి కోసం వేట కొనసాగిస్తున్నామని తెలిపారు. నగరంలో జోలియట్లోని వెస్ట్ ఎకర్స్ రోడ్లో ఉన్న 2200 బ్లాక్లో ఈ కాల్పుల ఘటన జరిగిందని, నిందితుడిని రోమియో నాన్స్ గుర్తించామని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని వివరించారు. రెండు ఇళ్లపై కాల్పులు జరిపాడని, మొత్తం ఎనిమిది మండి మృత్యువాతపడ్డారని జోలియట్ పోలీసు చీఫ్ బిల్ ఎవాన్స్ మీడియాకు వెల్లడించారు.
నిందితుడు నాన్స్(23) కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే నివసిస్తాడని తెలిపారు. ఎరుపు రంగు టయోటా క్యామ్రీ కారులో పరారైనట్టు భావిస్తున్నామని, అతడి వద్ద ఆయుధం ఉందని, అతడిని ప్రమాదకరంగా పరిగణించాలని అక్కడి పౌరులను జోలియట్ పోలీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తం చేసింది. మరణించిన వారితో అతడికి ముందే పరిచయం ఉన్నట్లు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మృతుల్లో ఒకరిని ఆదివారం చంపినట్లు, మిగిలిన ఏడుగురిని సోమవారం హత్యచేసినట్లు నిర్ధారించారు.
నాన్స్కు సంబంధించిన సమాచారం, అతడి జాడకు సంబంధించి ఏమైనా తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కాగా అగ్రరాజ్యం అమెరికా కాల్పుల ఘటనలతో వణికిపోతోంది. గణనీయ సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది మొదటి మూడు వారాల్లోనే 875 తుపాకీ కాల్పుల మరణాలు నమోదయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com