Myanmar earthquake: మయన్మార్లోనే ఎందుకింత తీవ్ర భూకంపం?

మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. ఈ రోజు మధ్యాహ్నం 12.50 గంటలకు 7.7, 6.4 తీవ్రతతో కూడా శక్తివంతమైన భూకంపాల కారణంగా మయన్మార్తో పాటు థాయ్లాండ్ వణికాయి. చాలా భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. మాండలేలోని ఐకానిక్ అవా వంతెన ఇరావడీ నదిలోకి కూలిపోయింది. వీటికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి.
మయన్మార్లోనే ఎందుకు భూకంపం..?
భూకంపాలు ఎక్కువగా వచ్చే దేశాల్లో మయన్మార్ కూడా ఉంది. మయన్మార్ దేశం ఉన్న ప్రదేశంలోని భూగర్భంలో ‘‘టెక్టానిక్ ప్లేట్స్’’ క్రియాశీలత ఎక్కువగా ఉంది. సాగైంగ్ ఫాల్ట్ లైన్ వెంబడి ఈ దేశం ఉంది. ఈ ప్రాంతంలో ఇండియన్ ప్లేట్, బర్మా మైక్రో ప్లేట్ మధ్య ప్రధానమైన టెక్టోనిక్ సరిహద్దు ఉంది. ఈ ఫాల్ట్ లైన్ దేశం గుండా దాదాపు 1200 కి.మీ వెళ్తుంది. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ఉత్తర దిశగా కదులుతూ మరో ప్లేట్ని ఢీకొడుతుండటంతో ఈ ప్రక్రియలో విపరీతమైన శక్తి భూకంపాల రూపంలో విడుదల అవుతుంది. సాగైంగ్ ఫాల్ట్ చివర బ్యాంకాక్ వైపు వెళ్లినందున ఆ దేశం కూడా భూకంపానికి గురైంది. భూకంప కేంద్రం లోతు ఎంత తక్కువగా ఉంటే.. నష్టం అంత ఎక్కువగా ఉంటుంది. ఇలా ఫలకాలు వేగంగా ఘర్షణకు లోనవుతున్న కారణంగానే మయన్మార్ ప్రాంతంలో తరచూ భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి.
ఈ సాగైంగ్ ఫాల్ట్కి భూకంపాల చరిత్ర ఉంది. 1946లో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చింది, 2012లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. సాగైంగ్ ఫాల్ట్ అనేది రెండు భూభాగాలు పక్కపక్కన కదులుతున్నాయి. ఈ కదలిక ప్రతీ ఏడాది 11 మి.మీ నుంచి 18 మీ.మీ వరకు ఉంటుంది. ఈ ఫాల్ట్ ఎల్లప్పుడూ మారతుండటం వల్ల కాలక్రమేణా ఒత్తిడి పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఒత్తిడి అకస్మాత్తుగా విడుదలై, భూకంపాలకు కారణం అవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com