Air India:ఎయిర్ ఇండియా విమానానికి గాల్లో సాంకేతిక సమస్య

Air India:ఎయిర్ ఇండియా విమానానికి గాల్లో సాంకేతిక సమస్య
X
గాల్లోనే తెరుచుకున్న ఎమర్జెన్సీ టర్బైన్.. యూకేలో ఎయిర్ ఇండియా విమానం సేఫ్ ల్యాండింగ్

ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. అమృత్‌సర్ నుంచి బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌కు బయలుదేరిన బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానంలో గాల్లో ఉండగానే సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం ల్యాండింగ్ కోసం కిందకు దిగుతున్న సమయంలో దాని అత్యవసర పవర్ యూనిట్ అయిన 'ర్యామ్ ఎయిర్ టర్బైన్' (ఆర్ఏటీ) అకస్మాత్తుగా తెరుచుకుంది. అయితే, పైలట్ల చాకచక్యంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.

ఈ ఘటన శనివారం ఏఐ117 విమానంలో చోటుచేసుకుంది. బర్మింగ్‌హామ్ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న క్రమంలో విమానం ర్యామ్ ఎయిర్ టర్బైన్ పనిచేయడం ప్రారంభించినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సంఘటనపై ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. "అమృత్‌సర్ నుంచి బర్మింగ్‌హామ్‌కు వెళ్తున్న ఏఐ117 విమానం ల్యాండింగ్ సమయంలో ర్యామ్ ఎయిర్ టర్బైన్ తెరుచుకున్నట్లు మా సిబ్బంది గుర్తించారు. ఆ సమయంలో విమానంలోని ఎలక్ట్రికల్, హైడ్రాలిక్ వ్యవస్థలన్నీ సాధారణంగానే పనిచేస్తున్నాయి. విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది" అని ఎయిర్ ఇండియా తెలిపింది.

ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని బర్మింగ్‌హామ్‌లోనే నిలిపివేసి, నిపుణులతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టినట్లు సంస్థ పేర్కొంది. ఈ కారణంగా, బర్మింగ్‌హామ్ నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సిన ఏఐ114 విమాన సర్వీసును రద్దు చేసినట్లు వెల్లడించింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, తమకు ప్రయాణికుల భద్రతే అత్యంత ముఖ్యమని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.

Tags

Next Story