Al Qaeda: ట్రంప్, జేడీవాన్స్, మస్క్ను చంపేస్తాం.. అల్ఖైదా హెచ్చరిక

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హతమారుస్తామంటూ అల్ ఖైదా అనుబంధ సంస్థ అరేబియన్ పెనున్సులా హెచ్చరించింది. ట్రంప్ తో పాటు ఎలాన్ మస్క్, అమెరికా మంత్రులనూ వదిలిపెట్టబోమని చెప్పింది. ఈ మేరకు అరేబియన్ పెనున్సులా చీఫ్ సాద్ బిన్ అతేఫ్ అల్ అవ్లాకీ తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు.
గాజాలో ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ట్రంప్ సహా అతడి మంత్రులను, వైట్ హౌస్ సిబ్బందిని అంతమొందిస్తామని చెప్పాడు. ఈ ప్రతీకారం ప్రపంచంలోని ముస్లింలందరిదని అన్నాడు. ఏ దేశానికి చెందిన వారైనా, ఏ వర్గానికి చెందిన వారైనా సరే మహమ్మద్ ను ప్రవక్తగా నమ్మే వారందరికీ ప్రతీకారం తీర్చుకోవాలంటూ పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా ఒక్క అమెరికాలోనే 4.5 మిలియన్ల మంది ముస్లింలు ఉన్నారని సాద్ బిన్ గుర్తుచేశాడు.
అల్ఖైదాలో అరేబియా పెనెన్సులా విభాగమే ప్రస్తుతం అత్యంత చురుగ్గా పనిచేస్తోంది. యెమెన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఉగ్రసంస్థ గతంలో ప్రమాదకర దాడులు నిర్వహించింది. బిన్ లాడెన్ మరణం తర్వాత అత్యంత ప్రమాదకర గ్రూపుగా అవతరించింది. 2024 మార్చిలో అరేబియన్ పెనున్సులా అధిపతిగా సాద్ బిన్ బాధ్యతలు చేపట్టాడు. సాద్ బిన్ తలపై అమెరికా ఇప్పటికే 6 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది.
గాజాలో పాలస్తీనా వాసులకు నిలువనీడ లేకుండా చేసినందుకు అమెరికా అధ్యక్షుడు, ఇతర మంత్రులపై భారీ స్థాయిలో ప్రతీకారం తీర్చుకోవాలని సాద్ బిన్ పిలుపునిచ్చాడు. అమెరికాలోని లక్ష్యాలపై దాడులు చేసేందుకు ఎలాంటి హద్దులు లేవని చెప్పాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com