Mojtaba Khamenei: ఇరాన్లో కొత్త శకం.. సుప్రీం లీడర్గా మోజ్తబా ఖమేనీ!

ఇరాన్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు, మోజ్తబా ఖమేనీ దేశ నూతన అత్యున్నత నేతగా ఎంపికయ్యారు. ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అలీ ఖమేనీ మరణించిన నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఏర్పడిన ఇస్లామిక్ రిపబ్లిక్లో తండ్రి తర్వాత కుమారుడు అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం ఇదే తొలిసారి.
మత పెద్దలతో కూడిన 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్' ఆదివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 'నిర్ణయాత్మక ఓటు'తో ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం ఉదయం ఇరాన్ ప్రభుత్వ మీడియా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. కొత్త నేతకు దేశ ప్రజలు, మేధావులు విధేయత ప్రకటించి, ఐక్యతను కాపాడాలని అసెంబ్లీ తన ప్రకటనలో పిలుపునిచ్చింది.
56 ఏళ్ల మోజ్తబా ఖమేనీ గతంలో ఎలాంటి అధికారిక పదవిలో లేనప్పటికీ, తెరవెనుక శక్తివంతమైన వ్యక్తిగా పేరుగాంచారు. ముఖ్యంగా ఇరాన్ సైన్యంలోని కీలకమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)పై ఆయనకు బలమైన పట్టు ఉంది. ఆయన నియామకం వెనుక ఐఆర్జీసీ ఒత్తిడి ఉందని కూడా అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మోజ్తబా నియామకాన్ని ఇరాన్ అధ్యక్షుడు, సైన్యాధిపతులు స్వాగతిస్తూ ఆయనకు తమ విధేయతను ప్రకటించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
