సాహస వీరుల జల సమాధి...పేలిపోయిన జలాంతర్గామి
అద్భుతం జరగలేదు. నిర్విరామంగా జరిగిన సహాయ చర్యలు ఫలించలేదు. టైటానిక్ శకలాలను చూసేందుకు ఐదుగురితో వెళ్లి గల్లంతైన టైటాన్ మినీ జలాంతర్గామి కథ విషాదాంతమైంది. ఎప్పుడో వందేళ్ల కిందట అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. కడలి గర్భంలోని టైటానిక్ను చూసేందుకు వెళ్లిన వారు.. ఆ సముద్ర గర్భంలోనే కలిసిపోయారు. ఐదు రోజులపాటు ప్రపంచం మొత్తం వాళ్ల జాడ గురించి ఉత్కంఠగా ఎదురుచూసినా... అన్నీ వ్యర్థమయ్యాయి. గంట గంటకు ఉత్కంఠ రేపిన ఈ ఘటన.. చివరకు శకలాల గుర్తింపు ప్రకటనతో విషాదాంతంగా ముగిసింది.సముద్ర గర్భంలో మునిగిపోయిన టైటానిక్ నౌక శిథిలాలను చూసేందుకు వెళ్లిన అయిదుగురు కుబేరులు ఆ కడలి గర్భంలోనే కలిసిపోయారు. తీవ్రమైన పీడనం పెరగడం వల్ల టైటాన్ మినీ జలాంతర్గామి పేలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్గార్డ్ ప్రకటించింది. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలను గుర్తించామని తెలిపింది. టైటానిక్ ఓడ సమీపంలో ఈ శకలాలను గుర్తించినట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ పేర్కొంది. అట్లాంటిక్ మహాసముద్రంలో 12 వేల అడుగుల లోతులోని టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఐదుగురు పర్యాటకులతో మినీ జలాంతర్గామి టైటాన్ గత ఆదివారం న్యూఫౌండ్ల్యాండ్ నుంచి వెళ్లింది. పాకిస్థాన్ బిలియనీర్ షెహజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్, UAEలో ఉంటున్న బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ మాజీ నౌకాదళ అధికారి పాల్ హెన్రీ..., యాత్ర నిర్వాహకుడు, ఓషన్గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్ ఈ జలాంతర్గామిలో వెళ్లారు. అయితే.. మూడు రోజుల నుంచి వీరి ఆచూకీ గల్లంతవగా కెనడా, అమెరికా తీర రక్షక దళాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. మరోవైపు వీరు ప్రయాణిస్తున్న టైటాన్లో....96 గంటలకు సరిపడా ఆక్సిజన్ నిల్వలే ఉండడంతో క్షణక్షణం ఉత్కంఠగా మారింది. భారత కాలమాన ప్రకారం..... గురువారం సాయంత్రం 7గంటల 15 నిమిషాల వరకు ఆక్సిజన్ సరిపోతుందని... నిపుణులు అంచనా వేశారు. రెండు రోజుల నుంచి టైటాన్ తప్పిపోయిన ప్రాంతంలో.. కొన్ని శబ్దాలు వినిపించినట్లు అమెరికా కోస్ట్గార్డ్ తెలిపింది. ఫలితంగా రెస్క్యూ సిబ్బంది అక్కడ గాలింపు చేపట్టినప్పటికీ... దాని జాడ దొరకలేదు. అయితే ఆ శబ్దాలు టైటాన్కు సంబంధించినవి కావని తర్వాత పేర్కొంది. గురువారం సాయంత్రం రిమోట్ ఆపరేటేడ్ వెహికల్ సాయంతో టైటానిక్ నౌకకు సమీపంలో కొన్ని శకలాలను గుర్తించినట్లు..అమెరికా కోస్ట్గార్డ్ ప్రకటన విడుదల చేసింది. తీవ్రమైన పీడనం పెరగడం వల్ల టైటాన్ పేలిపోవడంతో.. అందులో ఉన్న ఐదుగురు మరణించారని ప్రకటించింది. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సాయంతో... మినీ జలాంతర్గామి శకలాలను గుర్తించామని తెలిపింది. వెంటనే ఈ విషయాన్ని..... బాధితుల కుటుంబాలకు తెలిపినట్లు......... రియర్ అడ్మిరల్ జాన్ మౌగర్ తెలిపారు. అధిక అంతర్గత ఒత్తిడి వల్ల సబ్మెరిన్లు ఒక్కోసారి ఆగిపోయి.. నీటి అడుగుకు వెళ్లిపోతాయని కోస్ట్గార్డ్ వివరించింది. ఒక్కోసారి నీటి ఒత్తిడి భరించలేక అవి పేలిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే.. టైటాన్ పేలిపోయిన ఖచ్చితమైన క్షణం మాత్రం చరిత్రలో ఓ మిస్టరీగా మిగిలిపోయే అవకాశమే ఉంది. ఒకవేళ టైటాన్ శకలాల చెంత మృతదేహాలను గుర్తించినా.. అట్లాంటిక్ అడుగున ఉన్న వాతావరణం నుంచి వాటిని బయటకు తేలేని పరిస్థితి ఉందని అమెరికా కోస్ట్గార్డ్ అధికారికంగా ప్రకటించింది. యూఎస్ కోస్ట్ గార్డ్, రెస్య్కూ సిబ్బంది తరఫున మృతుల కుటుంబాలకు ప్రగాఢసంతాపం వ్యక్తం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com