China Earthquake: చైనాలో భారీ భూకంపం.. 111 మంది మృతి
![China Earthquake: చైనాలో భారీ భూకంపం.. 111 మంది మృతి China Earthquake: చైనాలో భారీ భూకంపం.. 111 మంది మృతి](https://www.tv5news.in/h-upload/2023/12/19/1142051-images.webp)
వాయువ్య చైనాలో సోమవారం (డిసెంబర్ 18) అర్ధరాత్రి దాటాక భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత ధాటికి దాదాపు 111 మంది మృతి చెందారు. 200 మందికి పైగా గాయపడ్డారు. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. చైనాలోని రెండు ప్రావిన్స్లలో భూకంపం వచ్చినట్లు అక్కడి స్థానిక మీడియా సంస్థ గ్జిన్హువా న్యూస్ ఏజెన్సీ తెలిపింది. గన్సు ప్రావిన్స్లో 100 మంది, పొరుగున ఉన్న కింగ్హై ప్రావిన్స్లో మరో 11 మంది మరణించినట్లు నివేదించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భూకంపం ధాటికి భయభ్రాంతులకు గురైన ప్రజలు రోడ్లపై పరుగులు తీశారు.
ఈ ప్రాంతంలో భూకంపం తీవ్రత రిక్టర్ స్కూల్పై 6.1గా నమోదైనట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) పేర్కొంది. భూకంపం 35 కి.మీ (21.75 మైళ్లు) లోతులో ఉందని, దాని కేంద్రం లాన్జౌ, చైనాకు పశ్చిమ-నైరుతి దిశలో 102 కిమీ దూరంలో ఉన్నట్లు EMSC తెలిపింది. దీంతో చైనా జాతీయ కమిషన్, అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ సహాయక చర్యలకు ఉపక్రమించింది. సహాయక బృందాలను ప్రభావిత ప్రాంతాలకు పంపించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. నేలకూలిన భవనాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని స్థానిక గ్రామాలలో విద్యుత్, నీటి సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. గడ్డకట్టే చలిలో ఎమర్జెన్సీ వాహనాలు రోడ్డ వెంట్ పరుగులు పెడుతున్నాయి. చైనా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11:59 నిమిషాలకు భూకంపం సంభవించింది.
భూకంపం దెబ్బకు పలు భవనాలు నేలకూలాయి. ప్రజలు ఆందోళనలతో రోడ్లవెంట పరుగులు తీశారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. నేలకూలిన భవనాలు స్థానిక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలో భూకంపం ఘటనపై ఆ దేశాధ్యక్షుడు జిన్పింగ్ వెంటనే స్పందించారు. సహాయక చర్యలను వెంటనే మొదలుపెట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. భూకంప బాధిత ప్రాంతాల్లో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపానికి సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, చైనాలో భూకంపాలు సర్వసాధారణం. ఈ ఏడాది ఆగస్టులో తూర్పు చైనాలో 5.4 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 23 మంది గాయపడ్డారు. డజన్ల కొద్దీ భవనాలు కూలిపోయాయి. సెప్టెంబర్ 2022లో సిచువాన్ ప్రావిన్స్లో 6.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో దాదాపు 100 మంది మరణించారు. 2008లో 7.9 తీవ్రతతో సంభవించిన భూకంపం 5,335 మంది పాఠశాల విద్యార్థులతో సహా 87,000 మందికి పైగా మరణించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com