Plane crash: మంచు తుపానులో విమాన ప్రమాదం... అమెరికాలో ఏడుగురి మృతి

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మయానే రాష్ట్రంలో భారీ మంచు తుపాను మధ్య ఓ ప్రైవేట్ జెట్ టేకాఫ్ సమయంలో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించగా, ఒకరు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.
వివరాల్లోకి వెళితే, బాంగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బంబార్డియర్ ఛాలెంజర్ 600 ప్రైవేట్ జెట్ ఆదివారం రాత్రి 7:45 గంటలకు టేకాఫ్ అయింది. విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 8 మంది ఉన్నారు. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే విమానం అదుపుతప్పి తలకిందులుగా పడిపోయింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. టేకాఫ్ క్లియరెన్స్ ఇచ్చిన 45 సెకన్ల తర్వాత "విమానం తలకిందులుగా పడింది" అని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రికార్డింగ్లో ఓ వాయిస్ వినిపించడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది.
ప్రమాదం జరిగిన సమయంలో అమెరికా తూర్పు తీరంలో తీవ్రమైన మంచు తుపాను కొనసాగుతోంది. బాంగర్ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తున్నప్పటికీ, విమానాల రాకపోకలు జరుగుతున్నాయని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తెలిపారు. సమాచారం అందిన నిమిషంలోపే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
ఈ ఘటనలో ఏడుగురు మరణించారని, సిబ్బందిలో ఒకరు ప్రాణాలతో బయటపడ్డారని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ధృవీకరించింది. నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాతే స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు. ప్రమాదం కారణంగా బాంగర్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
