Pahalgam Accused Adil Ahmed : విద్యార్థిగా వెళ్లి ఉగ్రవాదిగా తిరిగొచ్చిన ఆదిల్

Pahalgam Accused Adil Ahmed : విద్యార్థిగా వెళ్లి ఉగ్రవాదిగా తిరిగొచ్చిన ఆదిల్
X
పహల్గాం టెర్రరిస్టు అసలు కథ ఇదే..!

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఈ నెల 22న 26 మంది పర్యాటకులను బలిగొన్న పాశవిక దాడి ఘటనలో పాల్గొన్న ఉగ్రవాదులలో ఒకడైన ఆదిల్‌ అహ్మద్‌ థోకర్‌ 2018లో చదువుకోవడానికి పాకిస్థాన్‌కు వెళ్లి ఆరేండ్ల తర్వాత మరో ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులతో కలసి కశ్మీర్‌కు తిరిగి వచ్చినట్టు తెలిసింది. 2018లో ఆదిల్‌ అహ్మద్‌ స్టూడెంట్‌ వీసాపై పాకిస్థాన్‌కు వెళ్లాడు పాక్‌లో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాక 2024 చివరిలో అతడు భారత్‌లోకి తిరిగి ప్రవేశించాడు.

20 ఏళ్ల ఆదిల్ థోకర్ అనంత్‌నాగ్‌ జిల్లాలోని బిజ్‌బెహారాకు సమీపంలోని గురీ అనే చిన్న గ్రామంలో జన్మించాడు. టీనేజ్‌లో ఉండగానే పలు నిషేధిక ఉగ్ర సంస్థలకు చెందిన ఉగ్రవాదులకు దగ్గరయ్యాడు. 2018లో దక్షిణ కశ్మీర్‌లో జరిగిన ఓ ఉగ్రవాది అంతిమయాత్రలో పాల్గొన్నాడు. అదే ఏడాది పాక్ విద్యార్థి వీసా సాధించి వాఘా సరిహద్దు నుంచి పాక్‌లోకి అడుగుపెట్టాడు. ముందు నుండే ఉగ్రవాద భావజాలం కలిగిన ఆదిల్.. పాక్‌కు వెళ్లాక ఎవరితో టచ్‌లో లేకుండా పోయాడు. దాదాపు 8 నెలల పాటు కుటుంబంతోనూ మాట్లాడలేదు.

ఇలాంటి వారిపై నిఘా పెట్టే ఏజెన్సీలు కూడా ఆదిల్ సమాచారాన్ని సేకరించలేకపోయాయి. కనిపించకుండా పోయిన ఆదిల్.. లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో చేరినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌లో శిక్షణ తీసుకుని టాప్ కమాండర్లతో కలిసి పని చేసినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. శిక్షణ పూర్తై, కొన్ని నెలలు పని చేశాక.. 2024 చివర్లో భారత్‌కు తిరిగి వచ్చాడు. కానీ ఈసారి అధికారిక మార్గాల్లో కాకుండా.. పూంఛ్-రాజౌరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖను దాటి అక్రమంగా చొరబడ్డాడు. గుట్టలు, దట్టమైన అటవీ ఉన్న ఆ ప్రాంతం నుంచి ఆదిల్ తనతో పాటు కొత మంది పాకిస్థానీలను కూడా తీసుకువచ్చినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. అలా తీసుకువచ్చిన వారిలో పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న సులేమాన్ కూడా ఒకడు.

సరిహద్దు నుంచి తన స్వస్థలానికి చేరుకున్న ఆదిల్.. నిఘా ఏజెన్సీలకు చిక్కకుండా జాగ్రత్త పడ్డాడు. అనంత్‌నాగ్‌లో అతడు అండర్‌గ్రౌండ్‌లో దాక్కున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. కొన్ని వారాల పాటు స్థాిక టెర్రరిస్ట్ సెల్స్‌తో నిరంతరం సంప్రదింపులు జరిపి పహల్గాం ఉగ్రదాడికి పథకం రచించినట్లు తెలిసింది. భారత్‌లో చేపట్టబోయే ఉగ్రదాడి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా భారీ కుట్ర పన్నినట్లు అధికారులు భావిస్తున్నారు. అనువైన ప్రదేశం కోసం స్థానిక ఉగ్రవాద విభాగాలతో నిరంతరం సంప్రదింపులు జరిపాడు. రద్దీగా ఉండే టూరిస్ట్ ప్రదేశాలను ఎంచుకోవాలని భావించినా.. భద్రతా బలగాలలకు సవాలుగా ఉండే బైసరన్ లోయ అయితే తప్పించుకునేందుకు వీలు ఎక్కువగా ఉంటుందని దాన్ని ఎంచుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

ఏప్రిల్ 22న, పగలు 2 గంటల ప్రాంతలో ఆదిల్ సహా ఇంకొంత మంది ఉగ్రవాదులు దట్టమైన పైన్ అడవుల గుడా బైసరన్ లోయలోకి చేరుకున్నారు. పర్యాటకులను చుట్టుముట్టి, ముస్లింలా, హిందువులా అని అడిగి, మగవారి ప్యాంట్‌లు విప్పి తనిఖీ చేసి ముస్లింలు అయితే వదిలేశారు. హిందువులు అయితే అతి సమీపం నుంచి వారిపై కాల్పులు జరిపి హతమార్చారు.

Tags

Next Story