Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం హోటల్‌కు నిప్పు

ఒకే హోటల్‌లో 24 మంది సజీవదహనం!

బంగ్లాదేశ్‌ లో విధ్వంసం కొనసాగుతోంది. విద్యార్థి సంఘాల ఆందోళనలతో దేశం అట్టుడుకుతోంది. సైన్యం పాలన కొనసాగుతున్న బంగ్లాలో హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జషోర్‌ జిల్లాలో అవామీ లీగ్‌ ప్రధాన కార్యదర్శి షాహిన్‌ చక్లాదర్‌కు చెందిన జబీర్‌ ఇంటర్నేషనల్‌ హోటల్‌కు అల్లరిమూకలు నిప్పు పెట్టాయి. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనమైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇందులో ఒకరు ఇండోనేషియా పౌరుడు కూడా ఉన్నట్లు సమాచారం.

దీంతో బంగ్లాలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. 21 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల కారణంగా వందలాది మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 440కి చేరుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యం తీవ్రంగా యత్నిస్తోంది. షేక్‌ హసీనా రాజీనామా చేసి దేశం వీడిన తర్వాత కొన్ని గంటల్లోనే 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. హోటల్‌కు నిప్పు పెట్టిన ఆందోళనకారులు అగ్నిమాపక సిబ్బంది రాకుండా అడ్డుకున్నారు.

హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నా.. దేశంలో పరిస్థితి అదుపులోకి వచ్చే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. హసీనాకు వ్యతిరేకంగా నిరసనల కారణంగా కొన్ని రోజులుగా మూసివేసిన పాఠశాలను తిరిగి తెరిచినట్లు సమాచారం. దుకాణాలు, కార్యాలయాలు తెరుచుకున్నాయి. దీంతో పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దేశ పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు బంగ్లా అధ్యక్షుడు మహమ్మద్‌ షహబుద్దీన్‌ ఇప్పటికే ప్రకటించారు. దీంతో దేశంలో త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుంది.

రిజర్వేషన్లకు స్వస్తి పలికి ప్రతిభకు పట్టం కట్టాలని మొదలైన ఆందోళనలు పీఎం పీఠాన్ని కూల్చేశాయి. షేక్ హసీనా సోమవారం ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం.. భారత్‌కు వచ్చిన ఆమె ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నారు. రాజకీయ శరణార్థిగా ఆమె యూకేలో ఆశ్రయం కోరినట్లు సమాచారం. దీనిపై బ్రిటన్‌ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆమె ప్రస్తుతమున్న దేశంలోనే ఆశ్రయం పొందాలని పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. గత రెండు వారాలుగా అల్లర్ల కారణంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, ప్రాణ నష్టంపై ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలని అభిప్రాయపడింది.

Tags

Next Story