
అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత పెద్దఎత్తున యూజర్లు సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ను వీడినట్లు తెలుస్తోంది. ఈమేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దాదాపు 1,15,000 మంది అమెరికా యూజర్లు ఎన్నికల తర్వాత రోజు వెబ్సైట్లో తమ ఖాతాలను డీయాక్టివేట్ చేశారు. అయితే ఈ మొత్తం సంఖ్య కేవలం వెబ్సైట్ యూజర్లది మాత్రమే అని, మొబైల్ యాప్ ద్వారా డీయాక్టివేట్ చేసిన యూజర్ల సంఖ్య కాదన్న వార్తలు ప్రచురితమవుతున్నాయి.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపులో ‘ఎక్స్’ అధిపతి ఎలాన్ మస్క్ కీలకపాత్ర పోషించారు. ఈనేపథ్యంలో ఆయన నిర్వహిస్తున్న సోషల్మీడియా ప్లాట్ఫామ్పై ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు మస్క్ దీన్ని వినియోగిస్తారని పలువురు పేర్కొంటున్నారు. గతంలో నిషేధించిన ఖాతాలను పునరుద్ధరించడం, వెరిఫికేషన్ విధానాలను మార్చడం.. వంటి మస్క్ నిర్ణయాలు పెద్దఎత్తున విమర్శలకు దారితీశాయి. స్థాయితో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం డబ్బులు చెల్లించేలా తీసుకొచ్చిన మార్పులతో ప్లాట్ఫామ్ ప్రకటనల వ్యాపారం దెబ్బతింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com