పేలుళ్లతో దద్దరిల్లుతున్న సూడాన్‌

పేలుళ్లతో దద్దరిల్లుతున్న సూడాన్‌
X
దేశంపై పట్టు సాధించడానికి ఇటు సైన్యం.. అటు ఆర్ఎస్ఎఫ్ బలగాలు హోరాహోరీగా పోరును కొనసాగిస్తున్నాయి

సూడాన్ పేలుళ్లతో దద్దరిల్లుతోంది. వరుసగా మూడోరోజు కాల్పుల మోత మోగింది. ఎటు చూసినా సూడాన్ నేల రణక్షేత్రాన్ని తలపిస్తోంది. దేశంపై పట్టు సాధించడానికి ఇటు సైన్యం.. అటు ఆర్ఎస్ఎఫ్ బలగాలు హోరాహోరీగా పోరును కొనసాగిస్తున్నాయి. పరస్పర భీకర దాడులలో ఇప్పటివరకు 180 మందికి పైగా చనిపోయారు. వందల మంది క్షతగాత్రులగా మారారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించేందుకు వీలులేని దుస్థితి నెలకొంది.

సూడాన్ రాజధాని ఖార్తామ్‌లోని సైనిక ప్రధాన కార్యాలయం వద్ద భీకరంగా కాల్పులు జరిగాయి. పలుచోట్ల ఇళ్లను దోచుకున్నారు. విద్యుత్తు సరఫరా స్తంభించిపోయాయి. దాంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. భయం గుప్పిట్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్న ప్రజలు ఇళ్లలోనే తలదాచుకుంటున్నారు. ఇళ్ల నుంచి ఎక్కడ బయట కాలుపెడితే ప్రాణాలు తీసేస్తారేమోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఖార్తూమ్‌ విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయంలో 88 మంది విద్యార్థులు, సిబ్బంది మూడు రోజులుగా చిక్కుకుపోయారు. పేలుళ్లు, కాల్పుల నేపథ్యంలో ప్రజలెవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దని సూడాన్‌లోని భారతీయులకు భారత దౌత్య కార్యాలయం కోరింది. భారతీయుల కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సహాయం కోసం 1800 118797, 99682 91988, 011 23012113 నంబర్లలో సంప్రదించాలని భారత ఎంబసీ సూచించింది.

Tags

Next Story