Sunita Williams: సునీతా విలియమ్స్ లేకుండానే.. భూమిని చేరిన బోయింగ్

బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవసహిత ప్రయోగం అర్ధంతరంగా ముగిసింది. వ్యోమగాములను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన బోయింగ్ స్టార్లైనర్ (Boeing Starliner) వ్యోమనౌక.. వారిని అక్కడే వదిలేసి కిందికి వచ్చేసింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం తెలవారుజామున 12.01 గంటలకు న్యూ మెక్సికోలోని వైట్ స్యాండ్స్ స్పేస్ హార్బర్కు ఖాళీ క్యాప్సుల్ భూమిని చేరింది. వ్యోమగాములు లేకుండానే ఆటోపైలట్ పద్ధతిలో నాసా దానిని తిరిగి భూమి మీదకు తీసుకువచ్చింది.
ఉత్కంఠను మరింత పెంచుతూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి సరికొత్త బోయింగ్ ఆస్ట్రోనాట్ క్యాప్సుల్ స్టార్ లైనర్ ఈ ఉదయం భూమికి బయలుదేరింది. ఎన్ఎస్ఎస్ నుంచి స్టార్ లైనర్ అన్డాక్ కావడానికి ముందు.. ‘దానిని తిరిగి భూమికి తీసుకెళ్లండి.. గుడ్ బై టు స్టార్లైనర్.. గుడ్లక్’ అని బోయింగ్ మిషన్ కంట్రోల్తో సునీత విలియమ్స్ చెప్పారు.
సునీత, విల్మోర్ ఇద్దరూ నిజానికి 8 రోజుల మిషన్ కోసం జూన్లో అంతర్జాతీయ స్సేస్ స్టేషన్కు చేరుకున్నారు. వారం రోజుల్లోనే వారు భూమికి తిరిగి రావాల్సి ఉండగా స్టార్ లైనర్లో లోపాలు వారిని ప్రమాదంలోకి నెట్టేశాయి. థస్టర్ విఫలం కావడం, హీలియం లీక్ కావడంతో వారు అక్కడ చిక్కుకుపోయారు. దీంతో వారిని తీసుకురావడం ఎలానో తెలియక నాసా శాస్త్రవేత్తలు తలలు పట్టుకున్నారు. అప్పటి నుంచి వారి రాక కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. వారిని సురక్షితంగా భూమికి తిరిగి రప్పించడంపై నాసా మల్లగుల్లాలు పడింది.
చివరికి వారు లేకుండానే ఇప్పుడు స్టార్ లైనర్ వెనక్కి బయలుదేరింది. వస్తూవస్తూ పాత ఐఎస్ఎస్లో కొన్ని ఎక్విప్మెంట్స్ను మాత్రం మోసుకొస్తోంది. ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వారిద్దరినీ వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com