Pakistan: అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు..

పాకిస్థాన్లో అతిపెద్ద విమానాశ్రయం అయిన కరాచీ ఎయిర్పోర్టులో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. పేలుడులో ఇద్దరు చైనా పౌరులు మరణించగా, మరొక పాకిస్థానీ దుర్మరణం పాలయ్యాడు. పేలుడు పదార్థాలు అమర్చిన ఓ ట్యాంకర్ పేలిపోయింది. ఈ ఘటనలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నలుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. క్షతగాత్రులు అందరినీ అత్యవసర చికిత్స కోసం సమీపంలోని జిన్నా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
భారీ పేలుడు తర్వాత మంటలు చెలరేగి పక్కనే ఉన్న కార్లను చుట్టుముట్టాయి. ఘటనా స్థలం నుంచి దట్టమైన పొగ వెలువడింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక ఆ ప్రదేశంలో భారీ సైనిక బలగాలు మోహరించి ఉండడంతో వెంటనే ఘటనా స్థలాన్ని చుట్టుముట్టాయి.
కాగా విదేశీ పౌరులపై జరిగిన దాడి ఇది అని సింధ్ రాష్ట్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. విదేశీ పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. పేలుడు చాలా పెద్దది కావడంతో విమానాశ్రయ భవనాలు కంపించాయని పాకిస్థాన్ పౌర విమానయాన శాఖ అధికారి రాహత్ హుస్సేన్ వెల్లడించారు. సింధ్ రాష్ట్ర సీఎం మురాద్ అలీ షా ఈ ఘటనపై సమగ్ర నివేదిక కోరారని పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ తన దేశంలో ఉన్న చైనీస్ పౌరులు, సంస్థలు, ప్రాజెక్ట్లను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని ఎంబసీ తెలిపింది. ఈ దాడి పరిణామాలను కనుగొనగడానికి మేము పాకిస్తాన్తో కలిసి సాధ్యమైన సహాయం చేస్తామని తెలిపింది.
బాధ్యత వహించిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ
కరాచీ ఎయిర్పోర్టులో పేలుడుకు వేర్పాటువాద మిలిటెంట్ గ్రూప్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) బాధ్యత తీసుకుంది. ఈ మేరకు ఒక ఈ-మెయిల్ ప్రకటన విడుదల చేసింది. చైనా జాతీయులు లక్ష్యంగా వాహనంలో పేలుడు పరికరాన్ని అమర్చామని, ఈ పేలుడు తామే చేశామని బీఎల్ఏ పేర్కొంది. కాగా ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్లతో సరిహద్దులు పంచుకుంటున్న బలూచిస్థాన్ ప్రావిన్స్కు స్వాతంత్య్రాన్ని ఇవ్వాలంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ పోరాడుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com