BRAHMOS:భారత్ బ్రహ్మోస్‌తో వణికిపోయాం

BRAHMOS:భారత్ బ్రహ్మోస్‌తో వణికిపోయాం
X
పాక్ ప్రధాని షరీఫ్ సంచలన వ్యాఖ్యలు.. పాక్‌ను గజగజలాడించిన బ్రహ్మోస్‌

భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌ ‘సిందూర్’ పాక్‌లో తీవ్ర ప్రభంజనం సృష్టించింది. మే 10వ తేదీ తెల్లవారుజామున, భారత ఆర్మీ పీవోకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్), పాకిస్థాన్‌ లోపలకూ చొచ్చుకెళ్లి మెరుపుదాడులు జరిపింది. ఈ దాడుల్లో పాక్‌ సైనిక స్థావరాలు, ఉగ్రవాద శిబిరాలు భారీగా ధ్వంసమయ్యాయి. స్వదేశీయంగా తయారైన బ్రహ్మోస్‌ క్షిపణులతో, అధునాతన డ్రోన్లతో జరిగిన ఈ దాడులను స్వయంగా పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అంగీకరించారు. ‘‘భారత్‌ దాడులను దీటుగా తిప్పికొట్టాలని మే 9వ తేదీ రాత్రి మేం నిర్ణయించుకున్నాం. 10వ తేదీ తెల్లవారుజామున ప్రార్థనలు ముగిసిన వెంటనే.. 4.30 గంటలకు దాడులు చేసేందుకు మా సైన్యం సిద్ధమైంది. కానీ, మా ప్రణాళిక అమలుకు కొన్ని గంటల ముందే బ్రహ్మోస్‌ క్షిపణులతో భారత్‌ విరుచుకుపడింది. రావల్పిండి ఎయిర్‌పోర్టు సహా అనేక కీలకప్రాంతాలే లక్ష్యంగా దాడులు చేసింది’’ అని ప్రధాని షరీఫ్‌ పేర్కొన్నారు. అజర్‌బైజాన్‌ పర్యటనలో భాగంగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. దాడుల ప్రణాళిక గురించి ఆర్మీ చీఫ్ మునీర్‌ తనకు ముందస్తుగానే తెలియజేశారని అన్నారు. భారత దూకుడుతత్వం ఘర్షణను మరింత పెంచిందని ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు.

ఘర్షణకు నాంది.. పాక్ కుట్రకు ముందస్తు చెక్

షరీఫ్‌ ప్రకారం.. మే 9వ తేదీ రాత్రి పాక్‌ సైన్యం భారత్‌పై ప్రతీకార దాడులకు సిద్ధమవుతుండగా, భారత ఆర్మీ ముందుగానే నిఘా వల విస్తరించి కీలక సమాచారాన్ని సేకరించింది. ఆ సమాచారం ఆధారంగా, తెల్లవారుజామునే బ్రహ్మోస్‌ క్షిపణులతో దాడులు ప్రారంభించడంతో, పాక్‌ ప్రతీకార యత్నం ముందే విఫలమైంది.

పాక్‌ ప్రధాని అంగీకారం

భారత్‌ దాడులకు మేము సైద్ధాంతికంగా సిద్ధంగా ఉన్నప్పటికీ, వారి దూకుడుతో మేం ఎదురుచూసే స్థితిలో లేకుండా పోయాం. ఆర్మీ చీఫ్‌ మునీర్‌ మాకు ముందుగానే సమాచారం ఇచ్చారు. కానీ, భారత్‌ ముందుగానే అటాక్‌ చేయడంతో మా ప్రణాళిక పూర్తిగా నాశనం అయింది."- పాక్ ప్రధాని

మిగతా దేశాలు నిశ్శబ్దాన్ని పాటించాయి. అఫ్ఘానిస్థాన్, రష్యా, అమెరికా వంటి దేశాలు స్పందించకపోవడం పాక్‌ను మరింత ఒంటరిగా మిగిల్చింది. దీనితోనే పాక్‌ ప్రధాని వరుస విదేశీ పర్యటనలు మొదలుపెట్టారు. ఈ నేపధ్యంలో ఇటీవల ఆయన ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీతో భేటీ అయ్యారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌కు ప్రపంచ దేశాల నుంచి మద్దతు కరవైంది. కేవలం తుర్కియే, చైనా, అజర్‌బైజాన్‌, ఇరాన్‌లు మాత్రమే మద్దతుగా నిలిచాయి. దీంతో విదేశీ బాటపట్టిన పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌.. ఆయా దేశాల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Tags

Next Story