Naim Qassem: హిజ్బుల్లా కొత్త చీఫ్ తొలి ప్రసంగం

Naim Qassem: హిజ్బుల్లా కొత్త చీఫ్ తొలి ప్రసంగం
X
షరతులతో కాల్పుల విరమణకు అంగీకరిస్తామని వెల్లడి

హిజ్బుల్లా కొత్త చీఫ్ నయీం ఖాసిమ్ బుధవారం తొలి ప్రసంగం చేశారు. మంగళవారమే హసన్ నస్రల్లా వారసుడిగా ఎన్నికయ్యారు. ఒక్కరోజు వ్యవధిలో కాల్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హసన్ నస్రల్లా అడుగు జాడల్లోనే నడుచుకుంటానని ప్రకటించారు. ఇజ్రాయెల్ ప్రధాని ఇంటిపై జరిగిన డ్రోన్ దాడిలో నెతన్యాహు తప్పించుకున్నారని.. బహుశా అతనికి ఇంకా సమయం రాలేదేమోనన్నారు. షరతుల ప్రకారమైతే ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణను అంగీకరిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 27న ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించిన మాజీ హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మార్గంలో కొనసాగుతానని నయీం ఖాసిమ్ ప్రతిజ్ఞ చేశారు.

‘‘నా యుద్ధ వ్యూహాం.. మా నాయకుడు నస్రల్లా యుద్ధ వ్యూహానికి కొనసాగింపు. లెబనాన్‌కు వ్యతిరేకంగా జియోనిస్ట్ పాలన 39 వేల ఉల్లంఘనలకు పాల్పడింది. ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లో స్థావరాలను నిర్మించాలని చూస్తోంది. గాజా, లెబనాన్‌లలో ఇజ్రాయెల్ చేసిన హత్యానేరాల్లో అమెరికా, యురోపియన్‌ యూనియన్‌ రెండూ భాగస్వామిగా ఉన్నాయి. ఇజ్రాయెల్ లెబనాన్‌ను ఆక్రమించుకుని అరబ్ దేశంలో సెటిల్‌మెంట్లు చేసుకోవాలని యోచిస్తోంది. హెజ్బుల్లా ఇజ్రాయెల్ ఆలోచనలకు అడ్డుగా నిలుస్తోంది. గత నెలల్లో బాధాకరమైన ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత ప్రస్తుతం హిజ్బుల్లా గ్రూప్‌ కోలుకుంటోంది. లెబనీస్ నేల నుంచి యూదుల దేశం అత్యవసరంగా ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. నష్టాలను తగ్గించుకోవడానికి మా భూమి నుంచి వెళ్లిపోండి. ఇలాగే ఉండిపోతే.. మీ జీవితంలో ఎన్నడూ చెల్లించని భారీ మూల్యం చెల్లించుకుంటారు. హెజ్బుల్లా రోజులు, వారాలు, నెలల పాటు పోరాటాన్ని కొనసాగించగలదు’’ అని నయీం ఖాసిమ్ హెచ్చరించారు.

ఇదిలా ఉంటే హిజ్బుల్లాకు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు నయీం ఖాసిమ్‌ను కూడా చంపేస్తామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. నస్రల్లా మరణం తర్వాత ఇతడు ప్రాణ భయంతో ఇరాన్ పారిపోయినట్లుగా వార్తలు వినిపించాయి. ఇక హిజ్బుల్లాలో సీనియర్‌గా ఉన్న ఖాసిమ్‌ను మంగళవారం కొత్త చీఫ్‌గా ఎంచుకున్నారు.

Tags

Next Story