Liverpool Team: లివర్పూల్ పరేడ్లో విషాదం.. అభిమానుల మీదకు దూసుకెళ్లిన కారు

ఆనంద సంబరాల వేళ ఒక్కసారిగా వాతావరణం భీతావాహంగా మారింది. ఓ వైపు సంబరాలు.. ఇంకోవైపు హాహాకారాలతో ఇంగ్లండ్లోని లివర్పూల్ మారిపోయింది. ప్రీమియర్ లీగ్లో 20వ టైటిల్ను లివర్పూల్ ఫుట్బాల్ క్లబ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించింది. లివర్పూల్ జట్టు, సిబ్బంది ప్రీమియర్ లీగ్ ట్రోఫీతో ఓపెన్-టాప్ బస్సులో సిటీ సెంటర్ గుండా అభివాదం చేసుకుంటూ వెళ్లింది. చూసేందుకు లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు.
ఆనందోత్సవాలతో సాగిపోతున్న విజయోత్సవ ర్యాలీలో ఒక్కసారిగా హాహాకారాలు మొదలయ్యాయి. ఓ కారు అమాంతంగా దూసుకొచ్చింది. అభిమానులను ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లింది. దీంతో అభిమానులు పైకి లేచి ఎగిరిపడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో 27 మందికి గాయాలయ్యాయి. నలుగురు చిన్నారుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కారు ఆగగానే ఆగ్రహంతో ఉన్న అభిమానులు.. కారు అద్దాలు పగులగొట్టేందుకు ప్రయత్నించారు. డ్రైవర్ను పట్టుకుని దాడి చేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకుని తీసుకెళ్లిపోయారు.
లివర్పూల్ ప్రాంతానికి చెందిన 53 ఏళ్ల తెల్ల బ్రిటిష్ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సోషల్ మీడియాలో ఉగ్ర దాడి జరిగిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని పోలీసులు తోసిపుచ్చారు. ఇందులో ఇస్లామిక్ ఉగ్ర ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. ప్రమాదంలో 27 మంది గాయపడ్డారని.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. వాహనంలో చిక్కుకున్న నలుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. లివర్పూల్ జట్టు ప్రయాణిస్తున్న బస్సు వెళ్లిన 10 నిమిషాల తర్వాత ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షి పేర్కొ్న్నారు.
ఉగ్ర ప్రమేయం లేదన్న పోలీసుల వాదనపై విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. గతేడాది కూడా సమీపంలోని సౌత్పోర్టు పట్టణంలో ముగ్గురు యువతులు హత్యకు గురయ్యారు. అనంతరం రోజుల తరబడి అల్లర్లకు దారి తీసింది. దాడి చేసిన వ్యక్తి గుర్తింపుపై సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే పోలీసులు దీన్ని కూడా ఉగ్ర దాడి కాదని ఖండించారు.
ఇక ప్రమాదంపై ఇంగ్లండ్ ప్రధాని కీర్ స్టార్మర్ ఎక్స్ ట్విట్టర్లో స్పందించారు. ఈ ప్రమాదం చాలా భయంకరమైనదని చెప్పారు. గాయపడ్డ వారితోనే తన ఆలోచనలు ఉన్నాయని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com