Sikhs For Justice: ఎస్ఎఫ్జేపై నిషేధం పొడిగింపు

ఖలిస్థాన్ అనుకూల సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) కార్యకలాపాలపై ఐదేండ్ల పాటు నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 10 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం కింద ఆ సంస్థ జాతి వ్యతిరేక చర్యలను నిరోధించేందుకు, దేశ అంతర్గత భద్రతను, సమగ్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. పంజాబ్, తదితర ప్రాంతాల్లో ఎస్ఎఫ్జే జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ.. దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నదని వెల్లడించింది. దేశం నుంచి ఒక ప్రాంతం వేరు కావడాన్ని ఎస్ఎఫ్జే ప్రోత్సహిస్తున్నదని హోం శాఖ చెప్పింది.
జూలై 1,2020లో భారత ప్రభుత్వం పన్నూని టెర్రరిస్టుగా ప్రకటించింది. అమెరికా, కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగిన పన్నూ ఈ దేశాల్లో సిక్కు వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు. కెనడా వేదికగా పలు భారత వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. ఇతనిపై ఎన్ఐఏ అర డజనుకు పైగా కేసులు నమోదు చేసింది. గతేడాది పంజాబ్, చండీగఢ్లోని అతని ఆస్తుల్ని ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. అంతకుముందు, ఖలిస్తాన్ని బహిరంగంగా సమర్థిస్తూ, భారత దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను సవాల్ చేసినందుకు జూలై 2019లో ‘సిక్స్ ఫర్ జస్టిస్’పై కేంద్రం నిషేధం విధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com