China : టెహ్రాన్, టెల్ అవీవ్ను వీడండి.. తమ పౌరులకు చైనీస్ ఎంబసీ అడ్వైజరీ

ఇరాన్ రాజధాని టెహ్రాన్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ మరిన్ని వైమానిక దాడులకు పాల్పడవచ్చన్న భయంతో వేలాది మంది ప్రజలు నగరాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. దీంతో నగరం నుంచి ఉత్తరం వైపు కాస్పియన్ సముద్రం తీరానికి వెళ్లే రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
టెహ్రాన్లోని సైనిక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా తమ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఇంధనంపై రేషన్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. అదే సమయంలో, ఏటీఎంల నుంచి నగదు విత్డ్రాపై కూడా పరిమితులు విధించినట్లు సమాచారం.
నగరంలో నెలకొన్న భయానక వాతావరణం కారణంగా, చాలామంది ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కసారిగా జనాభా పెరిగినట్లు తెలుస్తోంది. సురక్షితమైన ఆశ్రయం కోసం ప్రజలు పడుతున్న ఆరాటం టెహ్రాన్ లోని నెలకొన్న భయానక పరిస్థితికి అద్దం పడుతోంది. మొత్తం మీద, ఇరాన్లో ఇజ్రాయెల్ దాడుల భయంతో అనిశ్చిత వాతావరణం నెలకొంది.
ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ నివాసితుల మధ్య పడడంతో పౌరులు చనిపోతున్నారు. అలాగే నివాసాలు కూడా దెబ్బతింటున్నాయి. ఇక హైఫా, ఇజ్రాయెల్ అంతటా వైమానిక దాడి సైరన్లు మోగుతున్నాయని ఐడీఎఫ్ తెలిపింది. ఇక క్షిపణులను అడ్డగించడానికి తమ వైమానిక రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయని తెలిపింది. పౌరులు ఆశ్రయాల్లోకి ప్రవేశించి తదుపరి నోటీసు వచ్చే వరకు అక్కడే ఉండాలని పిలుపునిచ్చింది.
ఇదిలా ఉంటే ఈ వారంలో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని ఆక్సియోస్ నివేదించింది. అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్- ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి మధ్య సమావేశం జరిగే అవకాశంపై వైట్ హౌస్ ఇరాన్తో చర్చలు జరుపుతున్నట్లు ఆక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది. అణు ఒప్పందం, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపుతో కూడిన దౌత్యపరమైన చొరవపై చర్చించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com