China : చైనా మోగ్లెవ్ రైలు-- అది రైలు కాదు అంతకు మించి

తాము కొత్తగా రూపొందించిన మ్యాగ్నెటికల్లీ లెవిటేటెడ్ (మ్యాగ్లెవ్) రైలు.. వేగంలో కొత్త రికార్డును సృష్టించిందని చైనా ఏరోస్పేస్, సైన్స్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ప్రకటించింది. రెండేళ్ల కిందట చైనా పరీక్షించిన మోగ్లేవ్ రైలు.. భూమిపై ప్రయాణించే అత్యంత వేగవంతమైన రైలుగా రికార్డుల్లోకి ఎక్కింది. దానిని ప్రస్తుత రైలు అధిగమించిందని ఈ మేరకు చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ( CASIC) ప్రకటన చేసింది. పరీక్షల సమయంలో కొత్త అయస్కాంత లెవిటేటెడ్ (మోగ్లెవ్) రైలు కేవలం 2 కి.మీ. పొడవున్న తక్కువ పీడనం కలిగిన ట్యూబ్లో మునుపటి రికార్డు గంటకు 623 కిలోమీటర్ల (గంటకు 387మైళ్లు) వేగాన్ని అధిగమించిందని పేర్కొంది.
ప్రపంచంలో కొత్త కొత్త ఆవిష్కరణలకు, అద్భుతాలకు చైనా పెట్టింది పేరు. సరికొత్త పరిశోధనలకు కేంద్ర బిందువైన చైనా తాజాగా మరో అద్భుతం చేసింది. గంటకు 623 కిలోమీటర్లకుపైగా వేగంతో ప్రయాణించే మోగ్లెవ్ రైలును విజయవంతంగా పరీక్షించింది. దీంతో గతంలో తన పేరిటి ఉన్న రికార్డును తానే బద్దలుకొట్టినట్టయ్యింది.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. రైలు చేరుకున్న ఖచ్చితమైన వేగం వెల్లడించకపోయినా... CASIC తాజా పరీక్షతో గణనీయమైన పురోగతి సాధించిందని పేర్కొంది. అల్ట్రా-ఫాస్ట్ హైపర్ లూప్ రైలు తక్కువ పీడనం కలిగిన ట్యూబ్లో ప్రయాణిస్తున్నప్పుడు స్థిరమైన వేగం అందుకోవడం ఇదే మొదటిసారి అని కూడా తెలిపింది. అంటే దీని అర్ధం త్వరలోనే విమానంతో సమావన వేగంతో నడిచే రైలును చైనా తయారుచేస్తుందని నివేదిక వ్యాఖ్యానించింది.
ఇది పూర్తిగా మోగ్లెవ్ సాంకేతికతతో నడుస్తుంది. ఈ టెక్నాలజీ విద్యుదయస్కాంతంతో రైలును నడిపి, ట్రాక్లపైన ఘర్షణను తగ్గిస్తుంది. మరింత వేగంగా ప్రయాణించడానికి ప్రత్యేకంగా రూపొందించిన గాలి నిరోధకతను తగ్గించే తక్కువ వాక్యూమ్ ట్యూబ్ సహకరిస్తుంది. CASIC తాజా పరీక్ష వేగంలో రికార్డ్ను నెలకొల్పడమే కాకుండా అనేక కీలక సాంకేతికతలను ధ్రువీకరించిందని, ఇవన్నీ సమన్వయంతో పనిచేస్తాయని నిరూపించిందని నివేదిక పేర్కొంది. ఏరోస్పేస్, టెరెస్ట్రియల్ రైల్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీలను అనుసంధానం చేసే హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ విమాన వేగాన్ని అధిగమించేలా గంటకు 1,000 కి.మీ వేగంతో నడిచే రైలును రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com