Sepoĸ: ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తే రాకెట్‌ డెలివరీ

Sepoĸ:  ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తే రాకెట్‌  డెలివరీ
X
చైనాలో వినూత్న ప్రయోగం..

రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు చైనా శ్రీకారం చుడుతోంది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ టావోబావోకు చెందిన ప్యాకేజీలను ఒక ప్రైవేటు రాకెట్ సంస్థ విజయవంతంగా డెలివరీ చేసి, తిరిగి సముద్రం నుంచి రాకెట్‌ను సురక్షితంగా రికవరీ చేసింది. ఈ ప్రయోగం వాణిజ్య అంతరిక్ష రవాణాలో ఒక కీలక ముందడుగుగా నిపుణులు భావిస్తున్నారు.

బీజింగ్‌కు చెందిన స్టార్టప్ సంస్థ 'సెపోక్' ఈ అద్భుత ప్రయోగాన్ని మే 29న చైనా తూర్పు తీరంలో నిర్వహించింది. తమ ఎక్స్‌జెడ్‌వై-1 వెరిఫికేషన్ రాకెట్ ద్వారా 20 కిలోలకు పైగా బరువున్న ప్యాకేజీలను రవాణా చేసినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రయోగాత్మక ప్రయాణంలో భాగంగా నేషనల్ లైబ్రరీ అధికారిక ఫ్లాగ్‌షిప్ స్టోర్‌కు చెందిన ఉత్పత్తులతో పాటు, ప్రత్యేకంగా ఈ టెస్టింగ్ కోసం రూపొందించిన స్మారక పోస్ట్‌కార్డులను కూడా పంపించారు.

26.8 మీటర్ల పొడవు, 57 టన్నుల బరువున్న ఈ స్టెయిన్‌లెస్ స్టీల్ రాకెట్ 125 సెకన్ల పాటు ప్రయాణించి, 2.5 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అనంతరం, షాన్‌డాంగ్ ప్రావిన్స్ సమీపంలోని సముద్ర ఉపరితలంపై నిట్టనిలువుగా విజయవంతంగా ల్యాండ్ అయింది. 18 గంటల పాటు శ్రమించి, రాకెట్‌ను చెక్కుచెదరకుండా వెలికితీసి, తమ కేంద్రానికి తరలించినట్లు సెపోక్ వెల్లడించింది. రాకెట్ చాలా మంచి స్థితిలో ఉందని పేర్కొంది. ఈ రాకెట్ కార్గో బే 120 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగి ఉందని, ఇది 10 టన్నుల వరకు సరుకులను, కార్లు, చిన్న ట్రక్కులను కూడా రవాణా చేయగలదని సంస్థ తెలిపింది.

భవిష్యత్ అంచనాలు, సవాళ్లు

"ప్యాకేజీ డెలివరీ అయింది, దయచేసి చెక్ చేసుకోండి!" అంటూ ఈ పరీక్ష విజయవంతమైన వెంటనే సెపోక్ వ్యవస్థాపకుడు వెయ్ యి తన మిత్రులకు సందేశం పంపారు. "పరీక్ష పారామితులు అగ్ని నిరోధకత, తేమ నిరోధకత, షాక్ అబ్సార్ప్షన్ వంటి అంశాల్లో ఎక్స్‌ప్రెస్ డెలివరీ వేర్‌హౌస్ ఆశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉందని రుజువు చేశాయి" అని ఆయన వివరించారు.

అలీబాబాకు చెందిన టావోబావోతో ఈ రాకెట్ కంపెనీ భాగస్వామ్యం.. చైనాలో రాకెట్ల ద్వారా నేరుగా గమ్యస్థానాలకు సరుకు రవాణా చేసే అభివృద్ధి చెందుతున్న రంగంలో పరిశోధనలకు నిదర్శనమని నిపుణులు అంటున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఖండాంతర డెలివరీ సమయాలను రోజుల నుంచి నిమిషాలకు తగ్గించడం ద్వారా ప్రపంచ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు.

అయితే, ప్రస్తుతానికి సాధారణ వినియోగదారుల డెలివరీలకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉందని వెయ్ యి అంగీకరించారు. అందువల్ల, అత్యవసర డెలివరీలు, విపత్తు సహాయం, మారుమూల ప్రాంతాలకు సరఫరాలపై ప్రాథమికంగా దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. "తిరిగి ఉపయోగించగలిగే రాకెట్ల సాధారణ వినియోగం, స్టెయిన్‌లెస్ స్టీల్ ఇంజనీరింగ్ అప్లికేషన్‌తో రాకెట్ డెలివరీ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ఆశిస్తున్నాం" అని వెయ్ యి పేర్కొన్నారు.

ఏరోస్పేస్ నిపుణుడు కావో మెంగ్ మాట్లాడుతూ, రాకెట్ డెలివరీ అనేది దీర్ఘకాలిక ప్రణాళిక అని, అయితే ఇది ఏదో ఒక రోజు ప్రపంచవ్యాప్తంగా నిజమైన ‘ఫ్లాష్ డెలివరీ’ని సాధ్యం చేస్తుందని అన్నారు. "తిరిగి ఉపయోగించగలిగే రాకెట్ రికవరీ టెక్నాలజీని, రాకెట్ బాడీ బలం, మన్నికను ధ్రువీకరించడానికి మరిన్ని పరీక్షలు అవసరం" అని ఆయన అభిప్రాయపడ్డారు.

సముద్రం నుంచి రికవరీ చేసిన తర్వాత ఎక్స్‌జెడ్‌వై-1 స్టెయిన్‌లెస్ స్టీల్ రాకెట్ బాడీలో ఎలాంటి డ్యామేజ్ లేదా లీకేజీ సంకేతాలు కనిపించలేదని, తోక భాగంలోని ఇంజన్లు, ఎలక్ట్రికల్ ఉత్పత్తులు మంచి స్థితిలో ఉన్నాయని సెపోక్ తెలిపింది. 2025 చివరి నాటికి తమ తొలి కక్ష్యా ప్రయోగం, రికవరీ మిషన్‌ను అమలు చేయగలమని రాకెట్ కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ రాకెట్ ద్రవ ఆక్సిజన్, మీథేన్ ఇంధనాన్ని ఉపయోగించి ఏడు టన్నుల బరువున్న వస్తువులను 1,100 కిలోమీటర్ల కక్ష్యలోకి చేరవేసేలా రూపొందించబడింది.

తదుపరి దశలో రాకెట్ డెలివరీ వేర్‌హౌస్ లేఅవుట్‌ను మరింత మెరుగుపరచనున్నారు. దీని ద్వారా తాజా వ్యవసాయ ఉత్పత్తులు, సున్నితమైన వస్తువులతో సహా రవాణా చేయగల వస్తువుల రకాలను విస్తరించనున్నారు. అలాగే, కార్గో భద్రతను నిర్ధారించడానికి ఒక ఎస్కేప్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేయనున్నట్లు సెపోక్ ప్రకటించింది.

Tags

Next Story