China: చైనాలో కత్తితో దాడి ఆరుగురు మృతి

చైనాలో దారుణం జరిగింది. గ్వాంగ్డాంగ్ ప్రావిన్సులోని ఓ కిండర్గార్టెన్లోకి ప్రవేశించిన 25 ఏళ్ల యువకుడు ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురిని కత్తితో పొడిచి చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాపు ప్రారంభించారు.
ఈశాన్య గ్వాంగ్డాంగ్ ప్రావిన్సులో స్థానిక కాలమానం ప్రకారం, సోమవారం ఉదయం 7:40 గంటల సమయంలో స్థానిక చిన్నారుల పాఠశాలలోకి ఒక వ్యక్తి కత్తితో ప్రవేశించాడు. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకొనే ప్రయత్నం చేయగా వారిని తోసుకుంటూ వెళ్లి అక్కడి పిల్లలు, టీచర్లపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన వారిని పొడుచుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. మృతుల్లో ఒక టీచర్, ఇద్దరు పేరెంట్స్, ముగ్గురు విద్యార్థులు ఉన్నారని, మరో వ్యక్తి గాయపడ్డాడని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణం అక్కడికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభమైనట్లు తెలిపారు.
నిజానికి చైనాలో ఇలాంటి హింసాత్మక దాడులు జరగడం అరుదు. ఎప్పుడో తప్ప ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేవు.. అయితే ఒక ఆరు నెలల క్రితం మాత్రం ఇలాంటి సంఘటనే జరిగింది. ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి ఏడుగురిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నవారిలో అధికారులపై, ఇతరులపై ప్రతీకారం తీర్చుకోవాలనుకునేవాళ్లు, మానసిక రోగులు ఎక్కువగా ఉంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com