Heat Record: వరల్డ్ టెంపరేచర్ రికార్డులను బద్దలుకొట్టిన '2023

2023 సంవత్సరం ప్రపంచ ఉష్ణోగ్రత రికార్డులను బద్దలు కొట్టిందని ఐక్య రాజ్య సమితి తెలిపింది. 2014 నుంచి 2023 దశాబ్దంలోఇప్పటివరకు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలను బ్రేక్ చేసిందని పేర్కొంది. హిమనీనదాలు కరగడం..., సముద్ర జలాలు వేడెక్కడంతోపాటు సముద్ర మట్టాలు పెరగడం వంటి ఎన్నో ఆందోళన కలిగించే పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించింది.
ప్రపంచంలో అధిక ఉష్ణోగ్రతలకు సంబంధించి గత రికార్డులను 2023 సంవత్సరం..బద్దలు కొట్టినట్లు ఐక్యరాజ్యసమితి నిర్ధరించింది. 2023 వ సంవత్సరంఇప్పటి వరకు నమోదైన అత్యంత వేడి గల సంవత్సరమని వెల్లడించింది. 2014-23 దశాబ్దాన్ని అత్యంత ఉష్ణోగ్రత ఉన్న దశాబ్దంగా ఐరాస తేల్చింది. ప్రపంచం.... ప్రమాదపు అంచున ఉందని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. శిలాజ ఇంధన వినియోగం పెరుగుదలే దీనికి కారణమని., వాతావరణ మార్పులు వేగంగా సంభవిస్తున్నాయని,ఈ భూగ్రహం మనకు ఒక విపత్తు సందేశాన్ని పంపుతోందని పేర్కొన్నారు.
గతేడాది సగటు ఉపరితల ఉష్ణోగ్రత 1.45డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉందని.., ఇది ప్రమాదకరంగా భావిస్తున్న 1.5 డిగ్రీల సెల్సియస్కు అతి చేరువలో ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ-WMO నివేదిక తెలిపింది. పారిస్ ఒప్పందం ప్రకారం1.5 డిగ్రీల పరిమితికి ఇంత చేరువకు రావడం ఇదే తొలిసారని ప్రకటించింది. ఇది ప్రపంచానికి.... ఒక రెడ్ అలెర్ట్ అని పేర్కొంది. 2023లో సముద్ర భాగంలోని 90శాతానికి పైగా ఏదో ఒక సమయంలో వడగాలుల పరిస్థితులను ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఇలాంటివి తరచూ సంభవిస్తే సముద్ర పర్యావరణ వ్యవస్థలు, పగడపు దిబ్బలు... తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటాయని హెచ్చరించింది. 1950 నుంటి ఇప్పటి వరకు... ప్రపంచంలోని ప్రముఖ హిమానీనదాలు...... ఎక్కువగా కరిగిపోయాయని వెల్లడించింది. స్విట్జర్లాండ్లోని ఆల్పైన్ హిమానీనదాలు గత రెండేళ్లలోనే వాటి మొత్తం పరిమాణంలో 10 శాతం కోల్పోయాయని తెలిపింది. మంచు ఫలకాలు తగ్గడం వల్ల. గతంలో ఎన్నడూ లేనంతగా సముద్ర మట్టాలు పెరిగాయని హెచ్చరించింది. గణాంకాలు మొదలైన 1930 తర్వాత దశాబ్దంతో పోలిస్తే 2014 నుంచి 23 వరకు సముద్రనీటి మట్టం రెట్టింపు స్థాయిలో పెరిగిందని వెల్లడించింది.
వాతావరణ మార్పులు ప్రపంచంలో వరదలు, కరవుకు ఆజ్యం పోస్తున్నాయని, ఫలితంగా వలసలు పెరుగుతున్నాయని WMO తెలిపింది. జీవ వైవిధ్యానికి నష్టం వాటిల్లుతోందని, ఆహారభద్రతకూ ముప్పు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్-19కి ముందు 14.9 కోట్ల మంది ప్రజలు ఆహార భద్రత సమస్యను ఎదుర్కొంటే 2023 చివరినాటికి అది 33.3 కోట్లకు చేరిందని ఉదాహరించింది.అయితే ఇదే సమయంలో సౌర, పవన జలవిద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి 50 శాతం పెరగడం..ఆశలు రేకెత్తిస్తోందని పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com