Paris Olympics 2024: ఈఫిల్ టవర్ ఎక్కిన ఓ వ్యక్తి.. అలర్ట్ అయిన పోలీసులు

కాసేపట్లో పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే.. ఈ కార్యక్రమానికి ముందు పారిస్లో ఒలింపిక్ నిర్వాహకులు ఊహించని సంఘటన జరిగింది. పారిస్లోని చారిత్రక ఈఫిల్ టవర్ను ఓ వ్యక్తి అధిరోహించాడు. దీంతో అధికారులు హడావుడిగా ఈఫిల్ టవర్ ప్రాంతం చుట్టూ ఉన్న వారిని అక్కడి నుంచి పంపించారు.
మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఓ వ్కక్తి చొక్కా ధరించకుండా టవర్ను ఎక్కుతూ కనిపించాడు. అయితే.. అతను ఎటు వైపు నుంచి ఎక్కాడో తెలియలేదు. మొదటిసారి చూసినప్పుడు డెక్ పైన, రెండోసారి ఒలింపిక్ రింగుల పైన కనిపించాడు. పారిస్ ఒలింపిక్స్ 2024 ముగింపు వేడుక సెయింట్ డెనిస్లోని స్టేడ్ డి ఫ్రాన్స్లో రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ప్రదేశం ఈఫిల్ టవర్కు చాలా దూరంలో ఉంది.
కాగా.. పారిస్లో ఒలింపిక్ ముగింపు వేడుకల దృష్ట్యా 30,000 మంది పోలీసులను మోహరించారు. ఫ్రాన్స్ అంతర్గత మంత్రి గెరాల్డ్ డర్మానిన్ మాట్లాడుతూ.. స్టేడ్ డి ఫ్రాన్స్ చుట్టూ సుమారు 3,000 మంది పోలీసు అధికారులను సమీకరించనున్నట్లు తెలిపారు. అలాగే పారిస్, సెయింట్-డెనిస్ ప్రాంతంలో 20,000 మంది పోలీసు దళాలు, ఇతర భద్రతా సిబ్బంది ఉండనున్నట్లు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com