ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా సెకండ్ వేవ్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోంది. మరణ మృదంగాన్ని మోగిస్తోంది. కరోనా ధాటికి ప్రపంచం మొత్తం కకావికలమయ్యాయి. అయితే నానాటీకి పెరిగిన మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టగా.. ఇప్పుడు మళ్లీ కరోనా సెకండ్ వేవ్ టెన్షన్.. ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. అమెరికా, యూరప్ దేశాలపై భారీగా ప్రభావాన్ని చూపుతున్నాయి. తాజాగా అమెరికాలో ఒక్క రోజే 79 వేల 852 మంది కరోనా బారిన పడ్డారు. వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత 24 గంటల్లో ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలో ఇప్పటిదాకా 2 లక్షల 30 వేల 510 మంది చనిపోయారు. పాజిటివ్ కేసుల సంఖ్య 88 లక్షల 89 వేల 183 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.
ఓహియో, మిచిగాస్, ఉత్తర కాలిఫోర్నియా, విస్కాన్సిస్ ప్రాంతాల్లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో ప్రజలు రెండు వారాల పాటు ఇళ్లకే పరిమితమవ్వాలని టెక్సాస్ రాష్ట్రంలో ఎల్పాసో నగర అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే అమెరికా తరువాత అత్యధిక మరణాల్లో బ్రెజిల్ రెండో స్థానంలో కొనసాగుతోంది. బ్రెజిల్లో ఇప్పటిదాకా దాదాపు లక్షా 57 వేల మంది కరోనాతో చనిపోయారు. 53 లక్షల 94 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇటు మెక్సికోలో కరోనా వైరస్ మరణాలకు బ్రేక్ పడట్లేదు. అడ్డు, అదుపు లేకుండా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఐరోపా ఖండంలోని పలు దేశాలు రెండోసారి కరోనా మహమ్మారి బారినపడి విలవిల్లాడుతున్నాయి. స్పెయిన్లో పాజిటివ్లు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, వంటి దేశాల్లోనూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. యూరప్ అంతటా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేనరీ దీవుల మినహా... దేశమంతటా అత్యవసర పరిస్థితులు విధుస్తున్నట్లు స్పెయిన్ ప్రధాని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా మూడో రోజు భారీగా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయని WHO ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com