ఆసుపత్రినుంచి డొనాల్డ్ ట్రంప్ డిశ్చార్జ్..

కరోనా చికిత్స కోసం సైనిక ఆసుపత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ డిశ్ఛార్జి అయ్యే అవకాశాలున్నాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడంతో రెండుసార్లు ఆయనకు ఆక్సిజన్ అందించామని వైటౌహౌస్ వైద్యులు తెలిపారు. శుక్రవారం ఒక దశలో ఆక్సిజన్ 94 శాతానికంటే దిగువకు పడిపోయిందని వివరించారు. ఇప్పుడు పరిస్థితి బాగుందని, జ్వరం ఏమాత్రం లేదని తెలిపారు. రెమిడెసివిర్ రెండో మోతాదు ఇచ్చిన తర్వాత కాలేయం, మూత్రపిండాలు వంటి కీలక అవయవాల పనితీరు సాధారణ స్థితికి చేరుకుందని తెలిపారు డాక్టర్లు. ట్రంప్ ఒక వీడియో విడుదల చేస్తూ- రాబోయే కొద్దిరోజులు నిజంగా తనకు పరీక్షా కాలమని, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు. తాను ఆసుపత్రిలో చేరినప్పటి కంటే ఇప్పుడు బాగున్నానని చెప్పారు.
అయితే... అధికారులు బయటకు చెప్పినదానికంటే ట్రంప్ పరిస్థితి శుక్రవారం మాత్రం సంక్లిష్టంగా ఉందని అంతకుముందు వైట్ హౌస్ సిబ్బంది అధిపతి మార్క్ మెడోస్ చెప్పారు. జ్వరం, ఆక్సిజన్ స్థాయిలపై తామెంతో ఆందోళన చెందామన్నారు. కానీ అనూహ్య రీతిలో ట్రంపు కోలుకున్నట్లు వెల్లడించారు.అయితే.... ఇంకా ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని, తామంతా అత్యంత అప్రమత్తంగా ఉన్నామన్నారు వైట్ హౌస్ ఫిజీషియన్ సియాన్ కాన్లే. రెమిడెసివిర్ రెండో మోతాదునూ ట్రంప్ తీసుకున్నారని తెలిపారు. ట్రంప్కు జ్వరం లేదని, ఆక్సిజన్ స్థాయి 96-98 మధ్య ఉంటోందని చెప్పారు. బహిరంగ సమావేశాల్లో పాల్గొనకపోవడమే ఉత్తమమనే సలహాలను పట్టించుకోకుండా ట్రంప్ విస్తృతంగా పర్యటిస్తూ వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఆగిపోయిన ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై ట్రంప్ బృందం గట్టి కసరత్తు చేస్తోంది. ఆయన వచ్చేవరకు సమయం వృథా కాకుండా కార్యాచరణ రూపొందించింది. కీలక రాష్ట్రాల్లో ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ట్రంప్ కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా ప్రచారంలో దిగుతారు. అధ్యక్షుడి అనారోగ్యం చిన్నదైనా, పెద్దదైనా అది ఏళ్ల తరబడి బయటకు రాదు. గతంలో వుడ్రో విల్సన్, గ్రోవర్ క్లీవ్లాండ్, లిండన్ బి జాన్సన్, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ విషయంలో ఇలాగే గోప్యత పాటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com